బాబుకు షాక్: ఎమ్మెల్యే వనిత రాజీనామా యోచన
తన నిర్ణయాన్ని వచ్చే నెల 4వ తేదీన ప్రకటిస్తానని వనిత చెప్పారు. ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు తెలుగుదేశం క్యాడర్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. గోపాలపురం నుంచి మొదటిసారి గత ఎన్నికల్లో వనిత శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.
కొవ్వూరు మాజీ శానససభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పెండ్యాల వెంకటకృష్ణారావు పార్టీకి గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నందువల్లనే వనిత కూడా ఆ బాటలో వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. వనిత తండ్రి బాబాజీరావు పెండ్యాల వెంకటకృష్ణారావు ముఖ్య అనుచరుడు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని, తనపై కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని వనిత అన్నారు.
తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలిని కూడా తన వెంట వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకుని వెళ్తే ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కృష్ణారావు భావించినట్లు చెబుతున్నారు. చింతలపూడి శాసనసభ్యుడు రాజేష్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.