మనమూ వాటా తీసుకున్నట్లే: షర్మిలపై రేవంత్
రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల ప్రజలకు వైయస్ 40 వేల కోట్ల పనులు చేస్తే, ఆయన కుమారుడు జగన్ ఒక్కడికే లక్ష కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గిలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తెలంగాణకు రాష్ట్ర మంత్రి డికె అరుణే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న 'మీ కోసం వస్తున్నా' పాదయాత్ర తెలంగాణలో అడుగుపెట్టగానే తెలంగాణవాదులు అడ్గుకునేందుకు ప్రయత్నించారని గుర్తు చేస్తూ షర్మిల చేస్తున్న పాదయాత్రలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఉద్యమం ముసుగులో అవినీతిపరులుగా మారిన కోదండరాం, నాగం జనార్దన్ రెడ్డి, పాలమూర్ జేఏసీ నాయకులు రాజేందర్రెడ్డిలకు ఇప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఉద్యమాల ముసుగుల్లో పెత్తందారుల సంఘానికి అధ్యక్షుడైన కేసీఆర్కు వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. డీకే అరుణ ఉద్యమాల పేరుతో గ్రూపులు జతచేసి ఢిల్లీ వీధుల్లో నాటకాలు ఆడుతూ, కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
మరోనేత నాగం జనార్దన్రెడ్డి భరోసా యాత్ర పేరుతో యాత్రలు నిర్వహిస్తున్నారని అంటూ ఆయన ఎవరికి భరోసా ఇస్తారో... అసలు ఆయనకు భరోసా ఉందా...? అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకున్న కేసీఆర్ కాంగ్రెస్ను ప్రశ్నించకుండా, టీడీపీని లక్ష్యంగా చేసుకోవడం, పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం మానుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్వార్థపూరిత రాజకీయాలను మానుకొని తెలంగాణ కోసం కృషి చేసిన వారికే పుట్టగతులుంటాయన్నారు.