జగన్ను జైల్లో కలిసినా, కొండా సురేఖ అలక వీడలేదా?
అయితే వారు జగన్ను కలిసిన తర్వాత కూడా అలక వీడినట్లుగా కనిపించడం లేదని అంటున్నారు. పార్టీలో వారు అంతకుముందు క్రియాశీలకంగా ఉండేవారని, ఇప్పుడు అలా కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వెంటే కొండా సురేఖ ఎక్కువగా ఉండేవారు. తెలంగాణ జిల్లాలో జగన్, విజయమ్మలు పర్యటించినా కొండా సురేఖ వెంటే ఉండేవారని గుర్తు చేస్తున్నారు.
ఇటీవల మాత్రం వారు అంతగా కనిపించడం లేదని చెబుతున్నారు. విజయమ్మ గత నెల 25వ తేది నుండి తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించారు. కొండా దంపతులు వరంగల్లో విజయమ్మ సభకు మాత్రమే హాజరయ్యారు. అంతేకాదు సభలో కొండా సురేఖ మార్క్ కనిపించడం లేదని చెబుతున్నారు. గతంలో పార్టీ కోసం వారి భారీగా జనాలను తరలించేవారట. కానీ ఈసారి విజయమ్మ వచ్చినా జనాలను తరలించే అంశంపై దృష్టి సారించలేదంటున్నారు. అందుకు విజయమ్మ సభలో ఖాళీ కుర్చీలు కనిపించడమే నిదర్శనమంటున్నారు.
విజయమ్మ వచ్చినా జన సమీకరణ చేయక పోవడం, పార్టీలోను గతంలో కనిపించినంత క్రియాశీలకంగా కనిపించక పోతుండటంతో కొండా దంపతులు ఇంకా అసంతృప్తిని వీడినట్లుగా కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్తో ములాకత్ అయిన తర్వాత కూడా అసంతృప్తిని వీడని వారికి కాంగ్రెసు పార్టీ నుండి ఆహ్వానాలు అందుతున్నాయని అంటున్నారు. జగన్ నుండి తమకు ఎలాంటి హామీ లభించక పోవడం కూడా వారి అసంతృప్తి కొనసాగుతుండటానికి కారణం కావొచ్చునని అంటున్నారు.