9 జిల్లాల్లో రెడ్ అలర్ట్: సముద్రంలోనే 11 మంది మత్స్యకారులు
తుపాన్ తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తీరప్రాంత 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వానొచ్చే వరదొచ్చే..
గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు తిరుమల తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమల ఆలయంతో పాటు వీధులు, కాటేజీలు, పార్కులు, రోడ్లు, వసతి సముదాయాలు జలమయమయ్యాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. బాధితులకు మొదట మంచి ఆహారం అందించాలని, వారికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకునే ప్రజలను బాగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానివ్వొద్దని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తగినన్ని మందులు సిద్ధం చేసుకోవాలన్నారు.
కరెంట్ సమస్య..?
విద్యుత్ వ్యవస్థ సజావుగా నడిచేలా చూడాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతింటే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది ఆగమేఘాలపై కదలాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించండి. ముఖ్యంగా, చెరువుల నిర్వహణ పరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. గండ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేయండి. పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంది... రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.ఏం కావాలన్నా తక్షణమే అడగండి... అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
బీ అలర్ట్
ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలు కేంద్రంగా మరో రెండు ఎన్డీఆర్ఎఫ్ దళాలు, మంగళగిరిలో మరికొన్ని అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు. భారీ వర్షాలతో తిరుమలలో కొండచరియలు విరిగిపడటం ఆందోళన కలిగిస్తుంది. తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు దగ్గర ఘటన జరిగింది. ఫలితంగా ఘాట్ రోడ్ లో భారీ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి 8 గంటలకు మొదటి, రెండో ఘాట్ రోడ్లను మూసివేయనున్నట్లు పర్యాటకులకు టీటీడీ సూచించింది. తిరిగి శుక్రవారం ఉదయం 6గంటలకు తెరవనున్నారు.
Recommended Video
సముద్రంలోనే 11 మంది
నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. ఇంజిన్ లో సమస్య తలెత్తడంతో మైపాడు వద్ద సముద్రంలో బోటు నిలిచిపోయింది. దీంతో బోటులోని మత్స్యకారులందరూ సముంద్రంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఫోన్ లో మత్స్యకారులతో కొండూరు అనీల్ బాబు మాట్లాడారు. మత్స్య కారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, నాయుడుపేటలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నాలుగు మండలాల్లో 2850 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. తడలోని అపార్ట్ మెంట్స్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరులో రమేష్ రెడ్డి నగర్, కలెక్టరేట్ సమీపంలో చెట్లు కూలిపడ్డాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.