స్మార్ట్ సిటీ: అమరావతి పోటీలో లేదు, 'కరీంనగర్' ఆశలపై నీళ్లు
విజయవాడ/న్యూఢిల్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కలేదు. తదుపరి విడతలో అమరావతికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు చెప్పారు.
తొలి విడతలో ఆయా నగరాల పరంగా గుర్తించిన లోపాలను 13 నగరాలు గణనీయంగా మెరుగుపరుచుకున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. అమరావతి సహా ఏడు రాష్ట్రాల రాజధానులు ప్రస్తుతం పోటీలో లేవని చెప్పారు. వీటిని తదుపరి విడతలో అనుమతిస్తామన్నారు.
అమరావతితో పాటు పాట్నా, షిమ్లా, నయా రాయపూర్, ఈటానగర్, బెంగళూరు, తిరువనంతపురంలు జాబితాలో లేవని చెప్పారు. వీటికి వచ్చే ఏడాది అవకాశం దక్కనుందని వెంకయ్య చెప్పారు.
దేశంలో 70 శాతం నగర జనాభా నివసిస్తున్న నగరాలకు అయిదేళ్ల దీర్ఖగాలిక ప్రణాళికలు ఉన్నట్లేనని తెలిపారు. 2004 - 2014 మధ్య నగరాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర సాయంగా రూ.33,902 కోట్లు అందితే, ఇప్పుడు తాము రూ.1,13,143కు పెంచామని చెప్పారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కార్పోరేషన్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన పైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
స్మార్ట్ సిటీలకు ప్రతిపాదనల్లో తొలుత హైదరాబాద్, వరంగల్ నగరాలను సూచించినా, ఆ తర్వాత హైదరాబాద్ బదులు కరీంనగర్ను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అయితే, ఈసారి వరంగల్ రెండోస్థానంలో నిలిచినా, కరీంనగర్ పైన నిర్ణయం తీసుకోలేదు.