మత్తయ్య కాల్ లిస్ట్: ట్యాపింగ్పై దూకుడు, ఏపీ హద్దు దాటుతోందని టీఆర్ఎస్ ఎంపీ
విజయవాడ/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ దూకుడు పెంచింది. జెరూసలేం మత్తయ్యకు చెందిన ఫోన్ కాల్ డేటాను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ న్యాయస్థానంలో సోమవారం నాడు మెమో దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏపీ సీరియస్గా తీసుకుంటోన్న విషయం తెలిసిందే.
అయితే, ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కదలికలను బట్టి ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. టీ న్యూస్ ఛానల్, సాక్షి ఛానళ్లకు నోటీసులు ఇచ్చాక ట్యాపింగ్ విషయంలో మరికొందరికి నోటీసులు ఇవ్వాలని భావించింది.
ఏపీ సీఎం చంద్రబాబు, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులకు చెందిన 120 ఫోన్ల ట్యాపింగ్, ఏపీ సిట్ అధికారులు సోమవారం భవానీపురం పోలీసు స్టేషన్లో పలువురు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుండి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. కొందరు సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్రతినిధులు, మరికొందరు న్యాయవాదుల ద్వారా వివరాలు సిట్కు అందించారు.
ఏపీ సర్కార్ పరిధి దాటుతోంది: బూర నర్సయ్య గౌడ్
ఏపీ సర్కారు తన పరిధిని దాటుతోందని తెరాస ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సోమవారం మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేంద్రం పరిధిలోని అంశమని చెప్పారు. తమ రాష్ట్ర పరిధిలోనికి రాని టీవీ ఛానల్కు ఏపీ నోటీసులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
తెలంగాణ సర్కారును అస్థిరపరిచే కుట్ర సాగుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు చేస్తున్నారన్నారు. కక్ష పూరితంగా తాము ఎవరినీ అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడం లేదన్నారు.