చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. పాయింట్ టు పాయిట్ వివరణ.. అసెంబ్లీలో స్పీచ్
మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నతర్వాతే అమరావతిలో రాజధానిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చామని, అలాంటిదాన్ని ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నారనేదానిపై సీఎం జగన్ కుగానీ, వైసీపీ నేతలకుగానీ క్లారిటీనే లేదన్నారు. సోమవారం అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ప్రభుత్వానికి గట్టిగా కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. ఆయనేం మాట్లాడారంటే..
ప్రజల కోసం ఎన్ని తిట్టయినా భరిస్తా..
‘‘ఒక రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలనేది టీడీపీ సిద్ధాంతం. దానికే కట్టుబడి ఉంటాం. అధికార పక్షం వాళ్లు మూడు రాజధానులపై తమ అభిప్రాయాలు చెప్పేకంటే.. నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికే ఎక్కువ టైమ్ తీసుకున్నారు. రాష్ట్రప్రజల కోసం నేను ఎన్ని తిట్లు పడటానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను తిడుతుంటే వినలేక.. మా ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయారు. అయినాసరే నేను వాటిని సద్విమర్శలుగానే తీసుకుంటున్నాను. అందరినీ ప్రజలు గమనిస్తున్నారు.
విభజన చట్టం ఏం చెబుతోంది?
రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏపీకి కొత్త రాజధాని కావాలి కాబట్టి దానిపై ఓ కమిటీని వేశారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని, ఏపీకి మాత్రం కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టంలో ‘రాజధాని' అన్నారేగానీ ‘రాజధానులు'అని ఎక్కడా చెప్పలేదు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని మీరు వక్రీకరిస్తే ఎలా? రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుంటే ఆ ప్రాంతంలోనే హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. పబ్లిక్ ఒపీనియన్ లో కూడా విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని స్పష్టమైంది.
ముమ్మాటికీ రాజధానికి అనుకూలమే..
విజయవాడ రాజధానికి పనికిరాదనిగానీ, మూడు రాజధానులు ఏర్పాటుచేసుకోవాలనిగానీ శివరామకృష్ణన్ ఎప్పుడూ చెప్పలేదు. మెరిట్స్ ను మాత్రమే ఆ కమిటీ పేర్కొంది. దాందోపాటు సెంటర్ పాయింట్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. అమరావతిని వరద ముంపు ప్రాంతం కాదని గ్రీన్ ట్రిబ్యూనల్ తేల్చిచెప్పింది. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నామనేది కూడా చాలా తప్పు. భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అమరావతిలో రాజధాని ద్వారా ఆహార భద్రతకు ముప్పు వస్తుందన్న వాదన కూడా తప్పని తేలింది. అమరావతి ప్రాంతం కృష్ణా డెల్టాలో లేదు. రాగద్వేషాలకు అతీతంగా, భావితరాల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమే అమరావతి. దీనిని తరలించడానికి వైసీపీ ప్రభుత్వం ఈ స్థాయిలో కుట్రలు చేయడం దారుణం.