నెల్లూరు మేయర్ పై ఛీటింగ్ కేసు;బుక్ చేసిన తమిళనాడు పోలీసులు...టిడిపిలో కలకలం
నెల్లూరు: ఎపిలో టిడిపి నేతలపై వరుస కేసులు నమోదు అవుతుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఇటీవలే గుంటూరులో కిడ్నీ రాకెట్ లో నర్సరావుపేట టిడిపి నేత పై కేసు నమోదు కాగా తాజాగా నెల్లూరు నగర మేయర్ పై కేసు బుక్ అవడం సంచలనం సృష్టిస్తోంది. పైగా ఈ కేసు నమోదు చేసింది తమిళనాడు పోలీసులు కావడం గమనార్హం.
నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తో పాటు అతని సోదరుడు, కుటుంబ సభ్యులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ అబ్దుల్ అజీజ్ అతని సోదరులు స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసునమోదు చేశారు. వీరిమీద మద్రాస్ సీసీబీ క్రైమ్ నెంబర్ 431-2017 అండర్ సెక్షన్ 406, 420, 506, రెడ్విత్ 120-బి, ఐపీసీ కేసులు నమోదు చేశారు.

స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ ప్రసాద్ జెంపెక్స్ అనే సంస్థ మద్రాస్ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ప్రాధమిక విచారణ అనంతరం మేయర్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేశారు. మరోవైపు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న మేయర్ అజీజ్ పై ఇలా ఛీటింగ్ కేసు నమోదు కావడంతో టీడీపీలో కలకలం సృష్టించింది. పైగా తమ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం టిడిపిని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications