కీలక ప్రకటన దిశగాసీఎం జగన్ - నేడు పార్టీ ముఖ్యులతో భేటీ : టార్గెట్ ఫిక్స్..!!
తిరిగి అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రెండు నెలల క్రితం పార్టీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు అందరితో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఇప్పుడు తన ఎన్నికల టీం తో వర్క్ షాప్ ఏర్పాటు చేసారు. ఇంటింటికి ప్రభుత్వం.. మంత్రుల బస్సు యాత్ర తరువాత క్షేత్ర స్థాయిలో ఆ కార్యక్రమాలకు వచ్చిన స్పందన పైన సీఎం పూర్తి నివేదికలు తెప్పించుకున్నారు.
అదే సమయంలో పార్టీలో కొత్త రాజకీయ వ్యూహకర్త ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో పార్టీ పని చేయగా.. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం రిషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేసేందుకు సిద్దమయ్యారు. ఆయన ఈ రోజు ఈ వర్క్ షాప్ కు హాజరవుతారని తెలుస్తోంది.
Recommended Video
గ్రౌండ్ రిపోర్టులు సిద్దం.. దిశా నిర్దేశం
వచ్చే నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. మహానాడు తరువాత పార్టీలో కొత్త జోష్ వచ్చినట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఇక, వైసీపీ ఓటమి ఖాయమంటూ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గోదావరి జిల్లాలను ఇక వైసీపీ మర్చి పోవాల్సిందేనంటూ సామాజిక సమీకరణాలను తెర మీదకు తెస్తున్నారు.
అన్ని వర్గాలు వైసీపీకి దూరమయ్యాయంటూ చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలోనే పొత్తుల అంశం ఏపీలో ప్రధాన చర్చగా మారింది. వైసీపీ మాత్రం తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనుంది. దీంతో.. తాము చేస్తున్న సంక్షేమ పథకాలతో పాజిటివ్ ఓటింగ్ తోనే తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాగా ఉంది.
సీఎం జగన్ కీలక నిర్ణయాల..టార్గెట్ ఫిక్స్
అయితే, ప్రతీ నేత ఆత్మవిశ్వసంతో పని చేయాలని చెబుతూనే..ఏ ఒక్కరూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండవద్దని సీఎం స్పష్టంగా సూచిస్తున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలే దిశా నిర్దేశం చేయనున్నారు. మంత్రులు..సమన్వయకర్తలు.. జిల్లాల అధ్యక్షులు హాజరయ్యే ఈ సమావేశంలో సీఎం జగన్ 2024 ఎన్నికల రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది.
అదే విధంగా.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి.. ప్రభుత్వం పట్ల ప్రజాదరణ...ఎమ్మెల్యేల పైన ప్రజాభిప్రాయం పైన సీఎం సర్వేలు చేయించారు. వాని నివేదికలు సైతం సిద్దమయినట్లు తెలుస్తోంది. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు సమయం నిర్దేశించి వారు ప్రజల్లో మార్కులు పెంచుకొనే విధంగా సీఎం జగన్ ఛాన్స్ ఇస్తున్నారు.
సీఎం మొదలు అందరూ ఇక ప్రజల్లోనే
కానీ, ప్రజల్లో ఇమేజ్ పెంచుకోలేకపోతున్న ఎమ్మెల్యేల విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఏ ఒక్క సీటును వదులుకొనేందుకు సీఎం జగన్ సిద్దంగా లేరని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇక, పార్టీ ప్లీనరీ తరువాత నుంచి సీఎం జగన్ సైతం జిల్లాల పర్యటనకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక, ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ ముఖ్యులకు వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలకమైన దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో..జగన్ ఏం చెబుతారనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో కనిపిస్తోంది.