వీడియో కలకలం: జకీర్ నాయక్ శాంతి దూత వ్యాఖ్యలపై డిగ్గీరాజా వివరణ
విశాఖపట్నం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఎప్పుడో 2012లో ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి జాతీయ రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టిస్తోంది.
ఆ వీడియోలో దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద ఇస్లామిక్ మత గురువు, ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ను శాంతి దూతగా అభివర్ణించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. వివరాల్లోకి వెళితే.. జకీర్ నాయిక్ 2012లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో దిగ్విజయ్సింగ్ పాల్గొన్నారు.
ఆ సమయంలో జకీర్ నాయక్ను దిగ్విజయ్ ప్రశంసలతో ముంచెత్తారు. జకీర్ను ఓ శాంతి దూతగా, దేశంలోని వివిధ వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చగల గొప్ప మహనీయుడిగా దిగ్విజయ్ అభివర్ణించారు. ప్రస్తుతం జకీర్ నాయక్ ప్రసంగాలు ప్రసారమవుతున్న 'పీస్ టీవీ'లో ఈ వీడియో కూడా ఆనాడు ప్రసారమైంది.
అయితే ఇటీవల బంగ్లా రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరిపై ఉగ్రదాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని జకీర్ నాయక్ ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జకీర్ నాయిక్తో దిగ్విజయ్సింగ్ కలిసి ఉన్న ఫొటోలు, వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
దీంతో ఉగ్రవాదులను ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ను దిగ్విజయ్ సింగ్ శాంతి దూతగా అభివర్ణించడంపై బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తుందనడానికి దిగ్విజయ్ వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడుతోంది.
అప్పట్లో ప్రసారమైన ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం పెను కలకలాన్ని సృష్టిస్తోంది. అయితే ఆనాడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని దిగ్విజయ్ సింగ్ చెప్పడం విశేషం. గురువారం ఆయన విశాఖపట్నానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జకీర్ నాయక్పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన వివరణ ఇచ్చారు.
2012లో ముంబైలో జరిగిన ఆ కార్యక్రమానికి ఇస్లామిక్ రీసెర్చీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ ఆహ్వానిస్తేనే తాను వెళ్లానని వ్యాఖ్యానించారు. ఆరోజు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. జకీర్ నాయక్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు.