అశ్లీల నృత్యాలు చేసిన మహిళల అరెస్టు...అర్థనగ్నంగానే...పోలీసుల తీరుపై విమర్శ
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఆశ్లీల నృత్యాలు చేశారంటూ కొందరు మహిళా డ్యాన్సర్లను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే ఈ మహిళా డ్యాన్సర్ల అరెస్ట్ సందర్భంగా పోలీసులు అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చింది.
పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. అయితే ఈ జాతరలో నిర్వాహకులతో ఒప్పందం మేరకు డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేసినట్లు తెలిసింది. ఈ అశ్లీల నృత్యాల గురించి సమాచారమందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళలను వారితో పాటు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు.
అయితే ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు అవకాశమిచ్చింది. పోలీసులు వచ్చే సమయానికి అర్థనగ్నంగా ఉన్న మహిళా డ్యాన్సర్లు దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఉన్నపళానే అలాగే అర్థనగ్నంగా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అలా చెయ్యడం సమంజసం కాదని స్థానిక మానవ హక్కుల సంఘం నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.