మరోసారి చంద్రబాబు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ:మాటల యుద్ధం
విజయవాడ:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. కన్నా మాటలకు స్పందించి చంద్రబాబు కౌంటర్ లు వేస్తుండగా...చంద్రబాబు విమర్శలపై కన్నా వెంటనే ప్రతిస్పందిస్తున్నారు.
తాజాగా బిజెపి పై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి నేతల విమర్శలపై స్పందించిన సిఎం చంద్రబాబు కేంద్రమే కుట్రలు చేస్తోందని తిప్పికొట్టారు. దీంతో సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబే చాలా తెలివిగా భారీ ఎత్తున కుట్రకు పాల్పడుతున్నారని అవి ఆయనకు అలవాటేనని కన్నా ఎద్దేవా చేశారు.
బిజెపిపై...చంద్రబాబు విసుర్లు
కన్నా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి చేస్తుంటే బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంపై అందరినీ రెచ్చగొడుతున్నారని, అతలాకుతలం చేయాలని, అస్థిరత్వాన్ని క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఈసారి కేంద్రంలో బీజేపీ రాదని, ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అన్నారు. ఇంతకుముందు టీడీపీ చక్రం తిప్పిందని, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి టీడీపీ కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబుపై మండిపడ్డ కన్నా
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీకి అక్రమసంబంధాలు అంటకడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపికి వేసినట్లేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ ధ్వజమెత్తారు.
Recommended Video
చంద్రబాబు...కౌంటర్
తాను నాలుగేళ్లు, 29 సార్లు ఢిల్లీకి తిరిగానని, ఏపీకి న్యాయం చేయాలని అడిగానని, అయినా కేంద్రం కనికరించలేదని అందుకే బయటకు వచ్చి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం విజయనగం జిల్లా, శృంగవరపు కోటలో జరుగుతున్న నవనిర్మాణ సంకల్ప దీక్ష సభలో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి నరేంద్రమోదీ మోసం చేశారని, ఇప్పుడు శ్రీవారినే మోసం చేసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కూడా...బిజెపిదే అధికారం
కానీ చంద్రబాబు ఎంత విష ప్రచారం చేసినా 2019లో కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కన్నా ఆశాభావం వ్యక్తం చేశారు. కారణం రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే?...నేను నాలుగేళ్లలో ఎంతో అభివృద్ది చేశాను, మళ్లీ 2019లో అవకాశం ఇవ్వాలని చెప్పుకునే పరిస్థితి ఆయనకు లేనే లేదని...అందుకే ఇలాంటి అతితెలివి ప్రదర్శిస్తున్నారని కన్నా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే నమ్ముతారని, బీజేపే అధికారంలోకి వస్తుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు.