ఎపి రవాణా వ్యవస్థలో సరికొత్త మార్పు:ఇకపై వాహనాలన్నింటికీ ఒకే కోడ్!
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి వాహనాన్ని ప్రభావితం చేయనున్న ఈ కీలక మార్పుకు రాష్ట్ర ప్రభుత్వమే తొలిసారిగా శ్రీకారం చుట్టింది.
ఇకపై కొత్త వాహనం ఏదైనా ఏ జిల్లా కు ఆ జిల్లా కోడ్ తో రిజస్ట్రేషన్ చేయడం కాకుండా రాష్ట్రం అంతటా ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చామని రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఏపీ 39 నంబర్ సిరీస్ తోనే ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందని అచ్చెన్నాయుడు చెప్పారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్రంలో వాహనాలకు జిల్లాల వారీగా వేరు వేరు కోడ్ లు ఉండటం కాకుండా...ఒకే కోడ్ ఉంటుందని మంత్రి అచ్చన్నాయుడు వివరించారు. అయితే ఈ విధానంతో పాత వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన వాహనాలకు మాత్రమే ఇలా ఒకే కోడ్ కేటాయించడం జరుగుతుందన్నారు. ఏపీ 39 నంబర్తో ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అనంతరం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ కొత్త విధానం వల్ల రెండున్నర రోజుల్లోనే అంకెల సిరీస్ మారిపోతూ ఉంటుందని చెప్పారు. తద్వారా నెలలోనే 15 సార్లు కొత్త సిరీస్ అంకెలు వస్తాయన్నారు. 15 రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని బాలసుబ్రమణ్యం తెలిపారు.