జోగయ్యా! సిబిఐ ఎదుట మాట్లాడలేదేం: రంగా హత్యపై ఉమ, బిజెపి నేతల్ని కట్టడి చేయాలి
విజయవాడ: వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపణలు చేసిన హరిరామ జోగయ్యకు విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ కౌంటర్ ఇచ్చారు. నాడు సిబిఐ ఎదుట హరిరామ జోగయ్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు జోగయ్య ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో, ఆ పుస్తకంలో ఎందుకు రాశారో అర్థం కావడం లేదన్నారు. ఆయన రాసిన పుస్తకంలో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పారు. ఓ పార్టీకి ప్రయోజనం చేసేందుకు జోగయ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.
తాము ఇప్పటికీ మిత్రధర్మం పాటిస్తున్నామని, బిజెపి అధిష్టానం వారి పార్టీ నేతలను అదుపులో పెట్టాలన్నారు. బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. కాపులకు వంద కోట్లు కేటాయించడం హర్షదాయకం అని చంద్రబాబుకు కితాబిచ్చారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు కాపులకు వంద కోట్లు ఇవ్వడం ఆనందమన్నారు.
బిజెపి నేతలదే తప్పు: సిపికి కాంగ్రెస్ ఫిర్యాదు
బిజెపి కార్యాలయం వద్ద జరిగిన దాడి ఘటనలో బిజెపి నేతలదే తప్పని బెజవాడ నగర పోలీస్ కమిషనర్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మంగళవారం సిపిని కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. అనంతరం పార్టీ నేత శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. దాడి ఘటన పైన దర్యాఫ్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో దెబ్బలు తిన్నవారు జైల్లో ఉన్నారని, దాడి చేసిన వారు బయట ఉన్నారన్నారు.