విశాఖ కేంద్రంగా వైసీపీ కొత్త స్కెచ్ - టార్గెట్ టీడీపీ..!!
వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఫిక్స్ చేయటానికి వైసీపీ అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. టార్గెట్ 175 అంటూ సీఎం జగన్ ఫిక్స్ చేసిన టార్గెట్ తో ఎక్కడికక్కడ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమ - ఉత్తరాంధ్రలో టీడీపీకి ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరాంధ్ర లో ఇప్పుడు వైసీపీ కొత్త ప్లాన్ సిద్దం చేస్తోంది. ఇప్పటికే అమరావతి మహా పాదయాత్రను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అనేక ప్రాంతాల్లో వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ టార్గెట్ గా వైసీపీ కొత్త వ్యూహాలు
వికేంద్రీకరణకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పుడు వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మేధావులు - వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిపి విశాఖ పరిపాలనా రాజధాని డిమాండ్ తో ఈ జేఏసీ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి విశాఖలో పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి- మంత్రి గుడివాడ అమర్నాధ్ పార్టీ నేతలతో చర్చలు చేసారు. ఈ నెల 9వ తేదీన పాడేరులో రౌండ్ టేబుల్ నిర్వహించాలని నిర్ణయించారు. జేఏసీ ఏర్పాటు చేసుకొని పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అమరావతి మహా పాదయాత్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు. 29 గ్రామాలకు 26 జిల్లాల ప్రజల కష్టార్జీతాన్ని ఖర్చు చేయాలా అని ప్రశ్నించారు.
విశాఖ నుంచే సీఎం పాలనా వ్యవహారాలు
ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ పాలన ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి నుంచి విశాఖ కేంద్రంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పాలనా వ్యవహారాలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే హైకోర్టు తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని నిర్ణయించే అధికారం ఉందని ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. దీని పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రజల్లో చర్చ కొనసాగేలా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ను డిమాండ్ చేస్తూ అక్కడ న్యాయవాదులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అనేక రంగాల వారిని భాగస్వాములను చేస్తూ మరింతగా చర్చ జరిగేలా చూడాలనేది వైసీపీ ఆలోచన గా తెలుస్తోంది.
అమరావతి యాత్ర సాగుతున్నవేళ
అటు టీడీపీ అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తోంది. కానీ, ఉత్తరాంధ్రలో ఇప్పుడు వైసీపీ సెంటిమెంట్ అంశం తెర పైకి తేవటం.. ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తుండటంతో టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం విశాఖ టీడీపీ హయాంలోనే డెవలప్ అయిందని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, మరి కొద్ది రోజుల్లో అమరావతి రైతుల మహా పాదయాత్ర గోదావరి జిల్లాలను దాటి ఉత్తరాంధ్రలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది. వికేంద్రీకరణ అస్త్రం తో ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బ తీసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో..ఇప్పుడు యాత్ర అక్కడకు చేరుకున్న సమయంలో టీడీపీ నేతలు మద్దతిస్తారా లేదా అనేది సందేహంగానే కనిపిస్తోంది. ద