ఫీజుల నియంత్రణపై చట్టం: సర్కార్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం.. సబ్ కమిటీ ఏర్పాటు
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. వానాకాలం పంట కొనుగోలు సహా కీలక అంశాలపై చర్చించింది. ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వచ్చే శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో మన ఊరు -మన బడి ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఫీజుల నియంత్రణ చట్టం, ఇంగ్లీషు మీడియం అంశాలపై అధ్యయానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫీజుల నియంత్రణ, ఇంగ్లీషు మీడియం అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి విధివిధానాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఈ సబ్ కమిటీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్ సమావేశంలో కొవిడ్ తీవ్రతపై చర్చించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా కేసుల నేపథ్యంలో కర్ఫ్యూ, స్కూళ్ల సెలవుల పొడగింపు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం.. కర్ఫ్యూ విధిస్తే మార్కెట్పై ప్రభావం తదిరత అంశాల గురించి డిస్కష్ చేసింది.