12తరగతి చదివిన కి'లేడీ': బాస్కు రూ.16 కోట్ల టోపీ, ఇలా లగ్జరీ లైఫ్..
ముంబై: 12వ తరగతి చదువుకున్న ఓ అమ్మాయి, అకౌంటెంటుగా పని చేస్తూ.. బాస్ నుంచి ఏకంగా రూ.16 కోట్లు కొట్టేసి, లగ్జరీ అపార్టుమెంట్లు, కార్లు కొనుగోలు చేసింది. కానీ ఆమె మోసం బట్టబయలు అయింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
29 ఏళ్ల వృశాలీ బమానే.. ఓ కంపెనీలో ఏడేళ్లకు పైగా అకౌంటెంటుగా పని చేసేది. తొలుత సహోద్యోగులను మచ్చిక చేసుకుంది. వారిని బుట్టలో వేసుకుంది. 2013 నుంచి క్రమంగా బ్యాంకు అకౌట్ల నుంచి రూ.16.32 కోట్ల నగదును తన భర్త, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి మరలించింది.
అంతేకాదు, తెలివిగా మరలించిన ఆ కోట్లాది రూపాయలను ఆస్తులుగా మలుచుకుంది. ఆ నగదుతో లగ్జరీ జీవితం అనుభవించింది. విలాసవంతమైన ఇండ్లను కట్టించుకుంది. ఐదు లగ్జరీ అపార్టుమెంట్లు, నాలుగు ఫ్యాన్సీ కార్లను కొనుగోలు చేసింది.
డాబు ప్రదర్శించేందుకు ఖరీదైన కార్లను, బైకులను బహుమతులుగా ఇచ్చింది. ఎక్కువ మొత్తాన్ని ఇంటీరియర్ డిజైన్కు ఖర్చు చేసింది. తన అన్ని వాహనాలకు నెంబర్ 3777ను వివిధ ఆర్డీవో కేంద్రాలలో నమోదు చేసుకుంది.
బాస్ నుంచి కొట్టి వేసిన డబ్బులను ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమెకు చెందిన ఎనిమిది బ్యాంకులను పోలీసులు గుర్తించారు. ఏ అకౌంటులోను నిధి దాచలేదు. ఎప్పటికప్పుడు విత్ డ్రా చేసింది.
కేరళ, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో సహా హెలికాప్టర్లలో షికార్లు కొట్టిందని తేలింది. విదేశీ పర్యటనల కోసం వీసాకు ధరకాస్తు చేసుకుంది. భర్తతో కలిసి విలాసవంతమైన వాటికి ఎక్కువగా ఖర్చు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆస్తులు సీజ్ చేయనున్నారు.