డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు... కేంద్రం కీలక ప్రకటన...
దేశంలో ఈ ఏడాది అగస్టు-డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 75 కోట్లు కోవీషీల్డ్,55 కోట్లు కోవాగ్జిన్ డోసులతో పాటు జైదుస్ క్యాడిలా,నోవావాక్స్,స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలో 300 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్లతో పాటు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ వ్యాక్సిన్ కంపెనీల నివేదికలను బట్టి ఈ అంచనాలను రూపొందించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకె పాల్ మాట్లాడుతూ... భారత్లో ఇప్పటివరకూ 17.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో వ్యాక్సినేషన్ విషయంలో అమెరికా,చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు,ప్రైవేట్ ఆస్పత్రుల కోసం 51.6 వ్యాక్సిన్ డోసులు సిద్దంగా ఉన్నాయన్నారు. మరో 15 రోజుల్లో రాష్ట్రాలకు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు అందుతాయని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాలు,ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా మాన్యుఫాక్చరర్స్ నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపారు.
ఇప్పటికే భారత్కు చేరిన రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చే వారానికి మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వీకె పాల్ తెలిపారు. భారత్లో స్పుత్నిక్ వి ఉత్పత్తి జులైలో ప్రారంభం కావచ్చునని చెప్పారు. ఫైజర్,మోడెర్నా,జె అండ్ జె మాన్యుఫాక్చర్స్తోనూ కేంద్రం టచ్లో ఉందన్నారు. భారత్కు వారు వ్యాక్సిన్ సప్లై చేయగలరా అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందని... అయితే 2021 నాటికి అందుబాటులోకి వచ్చే డోసులను బట్టి తాము స్పందిస్తామని ఆ కంపెనీలు చెబుతున్నట్లుగా తెలిపారు.
కోవీషీల్డ్ మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య గ్యాప్ను 12-16 వారాలకు పెంచడం పూర్తిగా శాస్త్రీయ నిర్ణయమని పాల్ తెలిపారు. సైంటిఫిక్ డేటా ఆధారంగానే నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు. కోవిడ్పై కేంద్రం నియమించిన జాతీయ సాంకేతిక సలహా కమిటీ ప్రతిపాదనలను గౌరవించాలన్నారు. ఇప్పటికే యూకె కూడా రెండు డోసుల మధ్య గ్యాప్ను 12 వారాలకు పెంచిందన్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వ్యాప్తి ఎప్పుడు పీక్స్కి చేరుతుందో చెప్పలేమన్నారు. వైరస్ స్వభావాన్ని అంచనా వేయలేమని చెప్పారు.