కోతి చేష్టలు: బృందావనంలో డబ్బుల వర్షం కురిసింది
లక్నో: మామూలుగా వర్షం కురిసిస్తే.. అందరూ తడవకుండా ఏదో ఓ చోటు చూసుకుంటారు. కానీ, డబ్బుల వర్షం కురిస్తే మాత్రం ఎగబడతారు. అదే జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనంలో. ఈ డబ్బుల వర్షానికి ఓ కోతి చేష్టలు కారణం కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బొరివలీ ప్రాంతానికి చెందిన హేమవతి సోంకర్(50) తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం బృందావనంకు వచ్చారు. బాంకీ విహారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత రోడ్డు పక్కనున్న దుకాణాల్లో షాషింగ్ చేస్తున్నారు.
అయితే ఓ కోతి హఠాత్తుగా కిందికి దూకి హేమవతి చేతిలోని బ్యాగ్ లాక్కుపోయింది. దుకాణం పైకి ఎక్కి అందులోని నోట్ల కట్టలను బయటకు లాగి పైనుంచి విసిరేసింది. డబ్బులు ఏరుకునేందుకు అక్కడున్నవారంతా పోటీ పడ్డారు. కాగా, తమకు దొరికిన నోట్లను చాలా మంది హేమవతికి తిరిగిచ్చేసి నిజాయితీ చాటుకున్నారు.
మరికొంతమంది మాత్రం డబ్బును జేబులో వేసుకుని జారుకున్నారు. కాగా, తన బ్యాగులో రూ. లక్షన్నర ఉందని, వీటిలో 100 నుంచి 500 నోట్లు ఉన్నాయని హేమవతి వెల్లడించారు. ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. బృందావనంలో కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇవి స్థానికులతోపాటు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.