కొరియా కన్నెర్రజేస్తే.. పసిడి పరుగే! ధరల్లో భారీ ఆటుపోట్లు.. ఈ దోబూచులాటకు అంతెక్కడ?
దసరా, దీపావళి, పండుగలతోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మదుపుదారులకు అంతు చిక్కడం లేదు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు కూడా బాంగారం ధరలో ఆటుపోట్లకు కార
న్యూఢిల్లీ: దసరా, దీపావళి, పండుగలతోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మదుపుదారులకు అంతు చిక్కడం లేదు. ఈ సమయంలో బంగారం కొనుగోలుచేయవచ్చా ?
నిజానికి ఈ సీజన్లో మన దగ్గర ఏటా పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. వరుణుడు కరుణించడంతో గ్రామీణ ప్రాంతం నుంచీ ఈ ఏడాది పసిడికి మంచి డిమాండే ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

ధరలో ఆటుపోట్లకు కారణాలెన్నో...
అయితే ఇటీవల డాలర్తో రూపాయి మారకం రేటు పెరిగిపోతోంది. జీఎస్టీ ప్రభావంపై మార్కెట్ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. దీనికి తోడు ప్రభుత్వం బంగారం కొనుగోళ్లనూ మనీ లాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. పెట్టుబడి లాభాల కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం, ప్రతి అమ్మకం-కొనుగోళ్లకు ఆధార్ లేదా పాన్ కార్డులతో పక్కాగా లెక్క చెప్పాల్సి రావడం కూడా బంగారం రేటు ఆటోపోట్లకు గురికావడానికి కారణం.

గతవారం ఇలా...
గత వారం ఒక దశలో రూ.31,000 దాటిన పది గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) పసిడి ధర ఆ తర్వాత కాస్త నీరసించింది. గత ఎనిమిదిన్నర నెలల్లో దేశంలో పసిడి ధర దాదాపు 10 శాతం పెరిగింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం 16 శాతం వరకు లాభపడింది. వరుణుడు కరుణించడంతో గ్రామీణ ప్రాంతం నుంచీ ఈ ఏడాది పసిడికి మంచి డిమాండే ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

ఇవీ ప్రతికూల అంశాలు...
నల్ల ధనంపై పోరు, మూలధన ఖాతా లోటు (క్యాడ్) కట్టడి వంటి విషయాలతో ప్రస్తుతం బులియన్ వ్యాపారంపై అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. దీనికి తోడు అక్రమ నగదు లావాదేవీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పసిడి అమ్మకాలపై నిబంధనలను మరింత తీవ్రం చేసింది. దీంతో నల్లధనంతో పసిడి కొనుగోలు చేసే వారు వెనుకాముందు ఆడే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం లేదన్న సంకేతాలూ బులియన్ మార్కెట్ను నిరాశ పరుస్తున్నాయి. దీనికి తోడు చాలా మంది నగల వ్యాపారులు ఇంకా జీఎస్టీకి పూర్తి స్థాయిలో అలవాటు పడలేదు. దీంతో ఈసారీ పండగల సీజన్లో అమ్మకాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ధరలు ఎలా ఉండవచ్చంటే..
మన దేశంలో బంగారం ధర డాలర్తో రూపాయి మారకం రేటు, అమెరికాలో వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఆటుపోట్లకు లోనవుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు రూ.30,000 దిగువన ఉన్న 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.30,800-31,000 మధ్య ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. పది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 1,357 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 1,320 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.

కొరియా ప్రభావం...
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు శృతి మించితే మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్లు దాటిపోవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మన దేశంలోనూ పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,000- 33,000 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఇదంతా భౌగోళిక ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొరియా సమస్య శాంతియుతంగా ముగిస్తే మాత్రం పసిడి ధర రూ.30,000 వరకు దిగొచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా పెళ్లిళ్ల వంటి అవసరాలకు తప్పించి, పసిడి కొనుగోళ్లు పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదని మార్కెట్ వర్గాల అంచనా.












Click it and Unblock the Notifications