కొత్త రూ. 500 నోట్ ప్రింటింగ్ ఖర్చెంతో తెలుసా?
పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.500 నోటు ముద్రణకు రూ.3.09 వ్యయవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపింది.
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.500 నోటు ముద్రణకు రూ.3.09 వ్యయవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త అనిల్ గల్గాలి కొత్త నోట్ల ముద్రణకయ్యే ఖర్చెంతో తెలపాలని అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
రూ.500 నోట్లు వెయ్యి ముద్రించడానికయ్యే ఖర్చు పేపర్తో సహా రూ.3,090 అవుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పి.విలాస్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
కాగా, కొత్తగా ముద్రించబోయే వెయ్యి రూపాయల నోట్ల ప్రింట్ ఆర్డర్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరించింది. గత నవంబర్ 8న పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదట రూ.2000ల కొత్త నోట్లను విడుదల చేసిన ఆర్బీఐ.. ఆ తర్వాత రూ. 500 నోట్లను విడుదల చేసింది. కొత్త వెయ్యి రూపాయల నోట్ల ముద్రణపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, వెయ్యి నోట్ల ముద్రణపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గతంలో ఓసారి స్పష్టం చేసింది.