9 మంది ఎంఎల్ఏలకు హైకోర్టులో చుక్కెదురు
ఉత్తరాఖండ్: అనర్హత వేటు పడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎంఎల్ఏ లకు హై కోర్టులో చుక్కెదురు అయ్యింది. తమ మీద స్పీకర్ వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఉత్తరాఖండ్ హై కోర్టు సోమవారం తిరస్కరించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హై కోర్టు సమర్థించింది.
ఈ దెబ్బతో మంగళవారం జరగనున్న బలపరిక్షలో 9 మంది ఎంఎల్ఏలు ఓటు వేసే అవకాశాన్ని కొల్పోయారు. న్యాయస్థానం తీర్పుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. కోర్టు తీర్పుతో మంగళవారం హరీష్ రావత్ అసెంబ్లీలో బలపరిక్షకు సిద్దం అవుతున్నారు.
ఉత్తరాఖండ్ హై కోర్టు తీర్పును కాంగ్రెస్ నాయకులు స్వాగతించారు. హరీష్ రావత్ నివాసం ఉద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈ తీర్పు చెప్పిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఉత్తరాఖండ్ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ 9 మంది కాంగ్రెస్ రెబల్ శాసన సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం మద్యాహ్నాం మా శాసన సభ్యుల పిటిషన్ విచారణకు రానుందని ఎంఎల్ఏల న్యాయవాదులు తెలిపారు.