భారత సాయం: నేపాల్కు ప్రమాదమంటున్న కమ్యూనిస్టులు
ఖాట్మాండ్: నేపాల్లో సంభవించిన భారీ భూకంపం తర్వాత అక్కడి ప్రభుత్వం కంటే ముందుగానే భారత ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. భారత సైన్యాన్ని పంపించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారత సహాయక బృందాలు, భద్రతా దళాలు భూకంపం కారణంగా శిథిలా కింద చిక్కుకుపోయిన ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి.
అయితే నేపాల్ కమ్యూనిస్టులు మాత్రం భారత సాయం వల్ల చైనాతో తమ దేశ సంబంధాలు దెబ్బతింటాయేమోనని భావిస్తున్నట్లు సమాచారం. భూకంపం అనంతర పరిణామాలపై నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా నేతృత్వంలో శనివారం ఖాట్మాండ్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో యుసిపిఎన్ (యూనైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
భూకంప బాధితులకు సహాయం పేరుతో భారత సైన్యం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని, వారి చర్యలు నేపాల్ అంతర్గత భద్రతను ప్రమాదకర స్థితిలోకి నెట్టేవిగా ఉన్నాయని, ఈ విషయంలో భారత సైన్యానికి తగిన మార్గదర్శకాలు సూచించాలని యుసిపిఎన్ కూటమి అధ్యక్షుడు పుష్ప కమల్ దహాల్, మోహన్ బైద్య, మజ్దూర్ కిసాన్ పార్టీ నాయకుడు నారాయణ్ మాన్లు ప్రధాని కోయిరాలాకు సూచించినట్లు నేపాల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.
అన్నపూర పోస్ట్ డెయిలీ కథనం ప్రకారం.. త్రిభువన్ ఎయిర్ పోర్టు, నేపాల్- చైనా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే భారత సైన్యం కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఇది నేపాల్- చైనా మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని కమ్యూనిస్టు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, నేపాల్ ప్రభుత్వం ఆదేశాలమేరకే ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం పనిచేస్తోందని భారత రాయబార కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. నేపాల్కు భారత్ అందించేది స్నేహహస్తమేనని విదేశాంగ కార్యదర్శి జైశంకర్ తెలిపారు.