భారత్లో 32 లక్షలు దాటిన కరోనా కేసులు: ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతూనే ఉంది. మంగళవారం మహారాష్ట్రతో కొన్ని రాష్ట్రాల్లో అధిక కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32 లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 31,67,323కు చేరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు మొత్తం కేసుల సంఖ్య 32,31,754కు చేరింది.
మహారాష్ట్ర, ఏపీలో అత్యధిక కేసులు
మహారాష్ట్రలో మంగళవారం 10,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9,927 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 8161 కొత్త కేసులు, తమిళనాడులో 5951, ఉత్తరప్రదేశ్లో 5124, ఢిల్లీలో 1544 కేసులు, గుజరాత్లో 1096, ఉత్తరాఖండ్లో 485, మణిపూర్లో 82 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు ఇండియాలోనే..
ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశంలోనే అత్యధిక కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. వరుసగా 18వ రోజు అత్యధిక కేసులు నమోదు చేసింది. రోజువారీగా కొత్త కేసుల నమోదును చూసుకున్నట్లయితే.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులున్న అమెరికా, బ్రెజిల్ కంటే ముందు వరుసలో భారత్ నిలుస్తోంది.ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,31,754కు చేరింది.7,04,322 యాక్టివ్ కేసులున్నాయి. 24,67,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 59,612 మంది కరోనాతో మరణించారు.
Recommended Video
త్వరలోనే బ్రెజిల్, అమెరికాలనూ దాటేస్తాం..
గత పది రోజుల నుంచి ప్రతి రోజూ సుమారు 55,000లకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో జనవరిలో తొలి కేసు నమోదైంది. కరోనా వ్యాప్తి కట్టడికి మార్చి నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మే నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కొత్త కేసులు ఇదేవిధంగా నమోదవుతుంటే.. త్వరలోనే బ్రెజిల్, అమెరికాలను దాటి భారత్ ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం లేకపోలేదు.