ఇదీ మరాఠీ దెబ్బ: రైతుల ఆందోళనతో దిగొచ్చిన ఫడ్నవీస్
దేశ ఆర్థిక రాజధాని ముంబై సహ ఇతర పట్టణాలు, నగరాలకు రైతులు పంట ఉత్పత్తుల సరఫరా నిలిపేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై సహ ఇతర పట్టణాలు, నగరాలకు రైతులు పంట ఉత్పత్తుల సరఫరా నిలిపేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. తమ డిమాండ్లలో 70 శాతం పరిష్కరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని కిసాన్ క్రాంతి తెలిపింది.
దీంతో రైతుల సమ్మె ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. రైతుల పంట రుణాలు మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కిసాన్ క్రాంతి కమిటీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మధ్య ఎడతెగని చర్చలు జరిగిన తర్వాత రైతులు ఆందోళన విరమించారు.
పంట రుణాల మాఫీ కోసం రైతు సంఘాల ప్రతినిధులను కూడా కలుపుకుని కమిటీ వేయనున్నామని ఫడ్నవీస్ తెలిపారు. ఈ కమిటీ వచ్చే అక్టోబర్ 31లోగా తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పంట రుణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పాల ధరలు పున: పరిశీలించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం మరణించిన రైతు అశోక్ మోరె కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమని అంగీకరించింది.
రైతుల దాడుల భయంతో వ్యాపారుల వెనుకడుగు
గురు, శుక్రవారాల్లో పంట రుణాల మాఫీ కోసం మహారాష్ట్రలో రైతుల నిరసనోద్యమం క్రమంగా ఉధ్రుతమైంది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కూరగాయలు, పాల సరఫరా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. నవీ ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీకి సరుకులు చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆందోళన చేస్తున్న రైతులు దాడులు చేస్తారేమోనన్న భయంతో వాహనదారులు వెనుకడుగు వేయడమే ఇందుకు కారణం. పాల సరఫరాపై పెద్దగా ప్రబావం పడకున్నా కూరగాయల సరఫరా చాలావరకు తగ్గిపోయింది. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. పైగా ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తమ హామీల నుంచి వెనక్కు తగ్గారని బీజేపీ మద్దతు దారైన స్వాభిమాని శేట్కారీ సంఘటన ఆరోపించింది. రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నెల రోజుల ముందే నోటీసు ఇచ్చామని పేర్కొన్నది.
స్వాభిమాని సేత్కారి సంఘటన్ ఇలా
పంటరుణాల మాఫీ, కనీస మద్దతుధర డిమాండ్లతో ఉద్యమబాట పట్టిన రైతులు పలుచోట్ల వాహనాలను అడ్డుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నాసిక్, పుణె, అహ్మద్నగర్ జిల్లాల్లో ఆందోళన ఉధృతంగా ఉంది. ముంబై - నాగ్పూర్ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ హైవేకోసం జరుపుతున్న భూసేకరణను కూడా మహారాష్ట్ర రైతులు వ్యతిరేకిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్న ఈ ఆందోళనకు బీజేపీ మిత్రపక్షమైన స్వాభిమానీ షేత్కరీ సంఘటన్ వంచి పార్టీలు నైతికమద్దతు తెలియజేస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని మొత్తం 15 రైతు మార్కెట్లు మూతపడ్డాయి. ఫలితంగా నాసిక్ పట్టణంలో, జిల్లాలో కూరగాయల కొరత తలెత్తింది.
పాల ట్యాంకర్ ను అడ్డుకున్న సిద్ధాపింప్రీ వాసులు
నాసిక్ నుంచి గుజరాత్కు పాలు తీసుకువెళ్తున్న ట్యాంకర్ను సిద్ధాపింప్రీ గ్రామం వద్ద ఆందోళనకారులు అడ్డగించి అందులోని పాలను రోడ్డు మీద పారబోశారు. కాగా యెవళా పట్టణంలో అల్లర్లతో విధించిన కర్ఫ్యూ శుక్రవారం రెండోరోజు కూడా కొనసాగింది. పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వినప్పుడు 14 మంది పోలీసులు గాయపడ్డారు. రైతులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపారు.
ఆందోళనకు అన్నా హజారే మద్దతు
ఇప్పటివరకు 50 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. విపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. రైతులకు సామాజిక కార్యకర్త అన్నాహజారే మద్దతు తెలిపారు. కోరితే రైతులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఆయన చెప్పారు.