పెళ్లి పేరుతో లూటీలు: గ్యాంగ్ లీడర్ బామ్మ
న్యూఢిల్లీ: మ్యాట్రీమోని వెబ్ సైట్లలో అమ్మాయిల వివరాలు తెలుసుకుని వారి ఇండ్లకు వెళ్లి లూటీలు చేస్తున్న ఘరానా ముఠా సభ్యులను దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ లీడర్ ఓ బామ్మ అని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.
మీరట్ కు చెందిన జహీదా (60), మహమ్మద్ సాజీద్ (26) అనే ఇద్దరిని అరెస్టు చేశామని బుధవారం పోలీసులు చెప్పారు. ఈ ముఠాలోని సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీ నగర జాయింట్ పోలీసు కమిషనర్ రవీంద్ర యాదవ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శ్రీమంతులు, వ్యాపారులు, ఉన్నతోద్యోగుల కుమార్తెలను వివాహం చేసుకుంటామని వారి ఇండ్లకు వెళ్లి పెళ్లి కుమార్తెను చూస్తున్నారు. కొన్ని రోజుల తరువాత పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి వస్తున్నామని వారికి సమాచారం ఇస్తున్నారు.
అనంతరం బామ్మ జహీదాను వెంట తీసుకుని వారి ఇండ్లకు వెలుతున్నారు. ఆ సందర్బంలో జహీదా తాను ఇల్లు చూస్తానని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెబుతుంది. ఇల్లు చూసే ముసుగులో ఖరీదైన వస్తువులు, బంగారు నగలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని జహీదా గమనించింది.
తరువాత బామ్మ ముఠాలోని సభ్యులకు విషయం చెబుతుంది. ముఠా సభ్యులు తుపాకితో అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించి లూటీలు చేసి అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ విధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలో 7 కుటుంబాల సభ్యులను బెదిరించి దోచుకున్నారు.
ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో బాగా డబ్బున్న ఓ వ్యాపారి ఇంట్లో ఇదే విధంగా లూటీ చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో వీరిద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఆ సందర్బంలో కొందరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.