ఉత్తర కొరియా నియంత కిమ్ భార్య 7 నెలలుగా కనిపించట్లేదు: ఎందుకు?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఏడు నెలలుగా కనిపించడం లేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మార్చి 28వ తేదీన చివరిసారి భర్త కిమ్తో కలిసి బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత నుంచి కనిపించలేదు.
దీంతో ఆమె అదృశ్యంపై పలు రకాల ప్రచారం సాగుతోంది. ఆమె ఎక్కడికెళ్లారు? ఎందుకు బయటకు రావటం లేదు? అందుకు కారణాలు ఏమై ఉంటాయన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
2012లో తొలిసారిగా కిమ్తో కలిసి ఆమె కనిపించారు. తన భార్య అని అందరికీ తెలియజేసేందుకే అప్పుడు కనిపించారు. వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారన్న విషయం మాత్రం రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత 2013లో 22 సార్లు, 2014లో 15 సార్లు, 2015లో మూడు సార్లు కిమ్తో కలిసి కనిపించారు.
చివరిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర కొరియా ఉపగ్రహం ప్రయోగించిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కనిపించారు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు.
ఉత్తర కొరియా ప్రచార కార్యకలాపాల విభాగం చీఫ్గా ఉన్న కిమ్ సోదరితో విభేదాల కారణంగానే ఆయన భార్య అదృశ్యమైందని కొందరు చెబుతుండగా, స్వయంగా కిమ్ భార్యను చంపి ఉంటాడని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2013లో దేశద్రోహం ఆరోపణల పైన కిమ్ తన మేనమామ జాంగ్ సాంగ్ థేక్ను ఉరితీశారు. అతనికి సన్నిహితురాలైన తన భార్య సోల్ జుతో కిమ్కు విభేదాలు వచ్చాయని చెబుతున్నారు. దీంతో కిమ్ ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాగా, 2013లో రి సోల్ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దాదాపు 7 దశాబ్దాలుగా ఉత్తర కొరియాను పాలిస్తున్న తమ వంశానికి వారసుడి కోసం కిమ్ ఎదురు చూస్తున్నాడట. ప్రస్తుతం రి సోల్ గర్భవతి అయి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెను కిమ్ బయటకు రానివ్వడం లేదని కొందరు భావిస్తున్నారు. మరోవైపు తన తాత, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి భార్యలు ప్రజల్లోకి పెద్దగా వచ్చేవారు కాదంటున్నారు.