అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల రెండో డిబెట్ నుంచి తప్పుకున్న ట్రంప్- టైమ్ వేస్టంటూ విసుర్లు...
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధిగా బరిలో ఉన్న ట్రంపే దీనికి కారణం. ఇప్పటికే కరోనా కారణంగా ప్రచారానికి దూరమైన ట్రంప్.. త్వరలో జరిగే అధ్యక్ష అభ్యర్ధుల చర్చ నుంచి కూడా తప్పుకున్నారు. వర్చువల్ పద్దతిలో నిర్వహించే ఈ డిబెట్కు ట్రంప్ దూరం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్న నేపథ్యంలో ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియాకు కూడా కరోనా సోకింది. వీరి నుంచి అధ్యక్ష భవనం వైట్హౌస్లో ఉన్న మరికొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ట్రంప్ భార్యతో పాటు క్వారంటైన్లో ఉంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నట్లు చెబుతున్నా ట్రంప్ వ్యవహారశైలి కారణంగా జనంలో అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. అధ్యక్ష అభ్యర్ధుల మధ్య ప్రతీసారీ జరిగే డిబేట్కు రెండో విడతలో పాల్గొనేందుకు ట్రంప్ నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Recommended Video
వర్చువల్ డిబేట్ను తాను డిబేట్గానే పరిగణించడం లేదని, అదో టైమ్ వైస్ట్ అని ట్రంప్ తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్కు ఫోన్లో ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. దీంతో వర్చువల్ పద్ధతిలోనూ తెరపైకి వచ్చేందుకు ట్రంప్ అంగీకరించకపోవడం వెనుక కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్ వ్యవహారశైలి చర్చకు తావిస్తోంది. మియామీలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల రెండో దశ చర్చను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ఇప్పటికే నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ స్టెరాయిడ్స్ తీసుకుంటున్న ట్రంప్కు నెగెటివ్ వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నా. జనంలో మాత్రం అనుమానాలు తొలగిపోలేదు.