కాపీ చేసినట్లుంది: తెరాసపై అక్బర్, లక్ష్మణ్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏమాత్రం స్పష్టత లేదని, గత ఏడాది బడ్జెట్నే కాపీ చేసినట్లుగా ఉందని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం శాసన సభలో అన్నారు. ఇస్లాం స్వచ్చంధ సంస్థలకు, అనాథలకు భూములివ్వాలన్నారు. షాదీ ముబారక్ పథకంలో సర్టిఫికేట్లు కావాలనడం దారుణమన్నారు. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీజేపీపై కాంగ్రెస్ అబాండాలు: లక్ష్మణ్
బీజేపీపై కాంగ్రెస్ అంబాడాలు వేస్తోందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ శాసనసభలో ముంపు మండలాల విషయంలో వెంకయ్యనాయుడు పేరు ప్రస్తావించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పరిస్థితి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
తప్పు కాంగ్రెస్ చేసి ఇతరులపై నెపం నెట్టడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును రూపొందించింది జైరాం రమేష్ కాదా అని ఆయన ప్రశ్నించారు. విభజన సమయంలో ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టును కోల్పోయే అంశాన్ని పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు విప్పలేదన్నారు.
మండలిలో మెట్రోపై వివరణ
మండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మెట్రో మార్పు, ఇబ్బందులపై స్పందించారు. మెట్రో రూటు మార్పును ఎల్ అండ్ టీ పరిశీలిస్తోందని చెప్పారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు లేవని చెప్పారు.