హైడ్రామా మధ్య బిజెపి అభ్యర్థి: టీచర్తో సవాల్ చేసి అమెరికాకు.. ఎవరీ దేవయ్య? (పిక్చర్స్)
హైదరాబాద్: వరంగల్ లోకసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా డాక్టర్ పగిడిపాటి దేవయ్య బరిలోకి దిగనున్నారు. దేవయ్య పేరును బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ జాతీయ పార్టీకి సిఫార్సు చేసింది. సోమవారం సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ పలువురు పేర్ల పరిశీలించారు.
అనంతరం దేవయ్య వైపు మొగ్గు చూపారు. వరంగల్ జిల్లా ఖిలాషాపూరం గ్రామానికి చెందిన దేవయ్య అమెరికాలో వైద్యుడిగా, వ్యాపారవేత్తగా ఉన్నారు. వరంగల్లో తమ అభ్యర్థిగా దేవయ్య పేరును బిజెపి జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది.
హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వరంగల్ లోకసభ ఎన్నికల బిజెపి ఇంఛార్జ్ పేరాల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
21 మంది దరఖాస్తు
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. బిజెపి - టిడిపి ఉమ్మడి అభ్యర్థి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నామినేషన్ దాఖలు వేస్తారన్నారు. బిజెపి అభ్యర్థిత్వం కోసం మొత్తం 21 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి ఒకరి పేరును జాతీయ నాయకత్వానికి పంపామన్నారు.
తర్జన భర్జన
దేవయ్య, చింతాస్వామి, రాజమౌళిల పేర్ల విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. అన్ని కోణాల్లో పరిశీలించి దేవయ్య పేరును ఖరారు చేసింది. స్వల్ప అస్వస్థతతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన కిషన్ రెడ్డి.. అభ్యర్థి నిర్ణయంపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో హాజరుకాలేదు.
హైడ్రామా
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ శాసనసభాపక్ష నేత కె లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు రామారావు, ఇంద్రసేనా రెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేవయ్య అభ్యర్థిత్వాన్ని నిర్ణయించినా పేరు వెల్లడించడంలో హైడ్రామా నడిచింది.
హైడ్రామా
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా నిర్ణయం చేయడం తగదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత నిర్ణయాధికారాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలకు అప్పగించినట్లు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు.
హైడ్రామా
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలు, ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశమైన దృష్ట్యా సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ఉందంటూ మీడియాకు వర్తమానం అందింది. ఆలస్యంగా ప్రారంభమైన మీడియా సమావేశంలో పేరాల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ అనివార్య కారణాలతో సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరు కాలేదని, అందుకే కమిటీ నిర్ణయించిన పేరును వెల్లడించలేకపోతున్నామన్నారు.
హైడ్రామా
చివరికి కమిటీ నిర్ణయాన్ని కిషన్ రెడ్డికి తెలిపాక.. దేవయ్య పేరును జాతీయ ఎన్నికల కమిటీకి పంపినట్లు కిషన్ రెడ్డి పేరుతోనే ప్రకటన వెలువడింది. గతంలో టిఆర్ఎస్లో ఉండి బయటకు వచ్చిన పార్టీ నేత చింతా స్వామి కూడా దరఖాస్తు చేసుకున్నారన్నారు.
హైడ్రామా
వరంగల్ లోకసభ ఉప ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజవర్గాల వారీగా ఇన్ఛార్జులను నియమించినట్లు తెలిపారు. టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరినీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరామన్నారు.
ఎవరీ దేవయ్య?
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా దేవయ్య ఎన్నారై. వైద్యుడి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. దేవయ్య నిరుపేద కుటుంబంలో పుట్టినా.. అకుంఠిత దీక్షతో శ్రమించి అసామాన్యుడిగా ఎదిగారు. తెలిసిన వృత్తికి సంబంధించిన వ్యాపారాన్నే ఎంచుకుని విజేతగా నిలిచారు.
ఎవరీ దేవయ్య?
వరంగల్ జిల్లా ఖిలాషాపూరం గ్రామానికి చెందిన పగిడిపాటి రత్నం, కోటమ్మల 11 మంది సంతానంలో చివరివాడు. చదువుల్లో ఎప్పుడు ముందుండేవారు. అభ్యుదయ భావాలు కలిగిన రత్నం.. దేవయ్యనే కాకుండా ఇరుగుపొరుగు పిల్లలు కూడా పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించేవారు.
ఎవరీ దేవయ్య?
బాల్యంలో దేవయ్య కుటుంబం ఒక చోటి నుంచి మరో చోటికి మారుతూ చివరగా జనగామలో స్థిరపడింది. దేవయ్య హెచ్ఎస్సీలో తెలంగాణలోనే టాప్ టెన్లో నిలిచారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్య తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీలో కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు.
ఎవరీ దేవయ్య?
అమెరికా వెళ్లాలన్న తన ప్రగాఢ కోరిక ఎప్పటికీ తీరదంటూ ఓ అధ్యాపకుడు సవాల్ చేసినా.. దేవయ్య పట్టుదలతో శ్రమించి అమెరికా వెళ్లడమే కాకుండా ఏకంగా హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోనే మెడిసిన్లో పీజీ సీటు సంపాదించారు. తర్వాత అమెరికాలో మెడికల్ సంబంధిత కంపెనీలు ప్రారంభించారు.
ఎవరీ దేవయ్య?
అనతికాలంలోనే వైద్యుడి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. అనంతరం స్వదేశానికి వచ్చి హైదరాబాద్లో ఆనియన్ టెక్నాలజీస్ ప్రారంభించారు. ఫ్రీడం హెల్త్ షౌండేషన్ పేరుతో బీమా కంపెనీ ప్రారంభించారు. వరంగల్లో మొదటిసారి ఐటీ కంపెనీనీ ఏర్పాటు చేశారు. దళితుల అభ్యున్నతి కోసం ‘నాదం' అనే సంస్థను స్థాపించారు. గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం ఏటా దాదాపు రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు.