దేవి క్రై ఫర్ హెల్ప్: 'హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చెబుతున్నారు'
హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు బుధవారం కేబీఆర్ పార్క్ వద్ద నిరసన, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దేవీరెడ్డి తండ్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ఇది ప్రమాదం కాదని, హత్యేనని చెప్పారు.
పోలీసులు ఈ విషయంలో సరైన విచారణ చేయడం లేదని ఆరోపించారు. గంటలో తేల్చాల్సిన కేసును నాలుగు రోజులుగా నాన్చడం పైన పోలీసుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తమ కూతురుకు భరతసింహా రెడ్డియే హానీ తలపెట్టారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రమాదం అనేది కేవల కల్పితమేనని వారు ఆరోపిస్తున్నారు. దేవి మృతి మిస్టరీని ఛేదించాలని విజ్ఞప్తి చేశారు. దేవిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. వందమందికి పైగా దేవీ రెడ్డి స్నేహితులు, గాయకుడు రేవంత్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
బీటెక్ విద్యార్ధిని దేవిని చంపేశారా.. : ఆ రోజు అసలేం జరిగింది..
దేవీ రెడ్డి స్నేహితులు సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. దేవీని హత్య చేశారని చెబుతూ ఫేస్బుక్లో సోషల్ మీడియా కంపెయిన్ ప్రారంభించారు. 'దేవీస్ క్రై ఫర్ హెల్ప్' అని ఉన్న ఆ ఫేస్బుక్ పేజీలో కనిపిస్తోంది.
కాగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవీ రెడ్డి మృతి విషయంలో అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోజు కారు నడుపుతున్న భరత సింహా రెడ్డికి గాయాలు కావడంతో అదే రోజు జూబ్లీహిల్స్ అపోలోలో చేరాడు.
ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు అతనిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. కేసును శాస్త్రీయంగా విచారించేందుకు సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో పడ్డారు. కారు బయలుదేరే సమయం నుంచి మాదాపూర్, రోడ్డు నెంబర్ 45 మీదుగా వచ్చిన సమయాన్ని సేకరిస్తున్నారు.