నీ నోటీసులకు భయపడేది లేదు.!గ్లోబరీనాతో సంబంధాలు నిజం కాదా.?కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్.!
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మన్సిపల్ శాఖ మంత్రి కే. తారక రామారావు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో సీఎం చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ కు నిజంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే, ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే, సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ బండి సంజయ్ చేసారు.
కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు..
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ శుక్రవారం రాత్రి ఆలస్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం సమీపంలోని హెచ్ఎండీ పార్క్ వద్దకు చేరకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పంపిన లీగల్ నోటీస్ పై ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. కేటీఆర్ నిర్వాకం వల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు చనిపోయారని, ఆ పాపం ఒట్టిగ పోతదా? పేద విద్యార్థులు చనిపోతే మీ అయ్య కనీసం స్పందించని మూర్ఖుడన్నారు బండి సంజయ్. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీఛార్జ్ చేయించిన దుర్మార్గపు కుటుంబం మీదని కేటీఆర్ పైన ధ్వజమెత్తారు.
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. కారకులు మీరు కాదా అని బండి సూటి ప్రశ్న
కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల తరపున పోరాడుతున్నామని, వాస్తవాలే మాట్లాడుతున్నామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కేటీఆర్ ఐక్య రాజ్యసమితికి వెళ్లి నోటీస్ ఇచ్చుకోవాలని సవాల్ విసిరారు. నా మీద దావా వేసే ముందు గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు ఉన్న సంబంధమేంటో చెప్పాలని నిలదీసారు. మీరు ఉద్యోగాలివ్వకపోవడంవల్ల వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్ల చావులకు కేటీఆర్, సీఎం చంద్రశేఖర్ రావే కారణమన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండె ఆగిన కార్మికుల చావులకు సీఎం కారణమయ్యాడు సీఎం మీద లీగల్ నోటీస్ ఇవ్వగలవా అని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. కేసీఆర్ కుటుంబం మీద 420కేసు పెట్టాలన్న బండి సంజయ్
317 జీవోతో ఇంటికొకరు పుట్టకొకరయిపోయి చాలామంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరని, వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో వరి కల్లాల మీద తనువు చాలించిన రైతుల చావులకు సీఎం కారణమని వీటన్నిటి కలుపుకుని సీఎం మీద లీగల్ నోటీస్ లు ఇవ్వగలవా అని కేటీఆర్ కు సవాల్ బండి సంజయ్ సవాల్ విసిరారు. అసలు చంద్రశేఖర్ రావు కుటుంబం మీద 420 కేసు పెట్టాలని, దళితుడిని సీఎం చేస్తానన్నారు, దళితులకు మూడెకరాలు ఇస్తానన్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు, నిరుద్యోగ భ్రుతి ఇస్తానన్నారు, రైతులకు రుణమాఫీ అన్నారు, ఇంటికో ఉద్యోగమిస్తానన్నారు, ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేసినందుకు మీ మీద 420 కేసు పెట్టాలని విరుచుకు బండి సంజయ్ పడ్డారు.
గ్లోబరీనా సంస్థతో సంబంధం లేదా.?సీబీఐ విచారణకు సిద్దమా అని బండి సంజయ్ సవాల్
అంతే కాకుండా కేటీఆర్ కు గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసారు. కేటీఆర్ కు యూఏఈలో ఉన్న బీఆర్ శెట్టితో ఉన్న సంబంధమేంటో అన్నీ తెలుసని, ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నామని, మీ సంగతి తేలుస్తామన్నారు బండి సంజయ్. శనివారం అమీత్ షా మీటింగ్ కు లక్షలాది మంది వస్తుండటంతో గజ గజ వణుకుతున్నారి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఏం చేయాలో తెల్వక లీగల్ నోటీసులతో డ్రామాలాడుతున్నరని కేటీఆర్ పైన మండిపడ్డారు. నేను ఇప్పటికే చాలాసార్లు ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు వెళ్లానని, జైలు తనకు కొత్త కాదన్నారు బండి సంజయ్. కేటీఆర్ ఎన్ని లీగల్ నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.