ఉద్యమ నేపథ్యం కాదు.!పార్టీ సభ్యత్వం ఎరగరు.!వారికి ఎమ్మెల్సీ పదవులా.?కేసీఆర్ పై ఉద్యమ కారులు గుస్సా.!
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు శరాఘాతంగా పరిణమించింది.ఎన్నడూ లేని విధంగా నిరసనల సెగ ప్రగతి భవన్ కు తాకబోతోంది. ఉద్యమ నేపధ్యం లేని వాళ్లను, కనీసం పార్టీ సభ్యత్వం అంటే ఏంటో తెలియని వాళ్లను ఏరుకొచ్చి ఎమ్మెల్సీ వదవులు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు తెలంగాణ కోసం ఇతర పార్టీ నేతల చేరికల ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పిన మాటలకు అసలైన ఉద్యమకారులు ఇరవై సంవత్సరాలుగా కటుబడి ఉన్నారు. అవకాశాలు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ కోసం ఉద్యమించిన నిఖార్సైన ఉద్యమకారులను చంద్రశేఖర్ రావు విస్మరిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుల్లో చర్చ జరుగుతోంది.
నివురుగప్పిన నిప్పులా ఉద్యమకారులు.. చిచ్చు పెడుతున్న ఎమ్మెల్సీ పదవులు
ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ చిచ్చుకు కారణం అయ్యేట్టు పరిణమిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ మలి ఉద్యమంలో పాల్గొని అసలైన పోరాటం చేసిన నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో ఎలాంటి పదవులకు నోచుకోవడం లేదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా వారిని జీవిత కాలం వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్నారనే విమర్శలు తారా స్థాయిలో వినిపిస్తున్నాయి. తొలి విడత బంగారు తెలంగాణ బలోపేతానికి పదవులను త్యాగం చేస్తే రెండోసారి కూడా ఎందుకు త్యాగాలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి రెండు దఫాలకు పైనే అవకాశాలు కల్పించడం అవసరమా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు సిసలైన ఉద్యమకారులు.
పదవులు ఇచ్చిన వారికే మళ్లీ ఇస్తున్నారు. మేమేం అన్యాయం చేసామంటున్న ఉద్యమకారులు
తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి ఎన్నో ఉద్యమాలు చేసామని, ఈ నేపథ్యంలో ఆస్తులను, అయిన వాళ్లను కూడా కోల్పియామని మరికొంత మంది ఉద్యమకారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తొలగిపోతాయని ఎన్నో కలలు కన్నామని, కాని తెలంగాణ సిద్దించిన తర్వాత కూడా సమస్యలు ఇంకా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యమకారులు. ఉద్యోగాలు లేక సరైన ఉపాది లేక రాజకీయంగా పట్టించుకున్న నాథుడు లేక అనేక సమస్యల్లో చిక్కుకున్నామని ఉద్యమకారులు తమ కష్టాలను ఏకరువుపెడుతున్నారు. రాజకీయంగా ఇంటి గుమ్మం వరకూ వస్తున్న అవకాశాలను ఇతర పార్టీ నేతలు తన్నుకుపొతుంటే ఉసూరుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తుందని ఉద్యమకారులు చెప్పుకొస్తున్నారు.
ఉద్యమం తెలియదు..సభ్యత్వం తెలియదు.. వారికా ఎమ్మెల్సీ పదవులు.?ఉద్యమకారుల సూటి ప్రశ్న
ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆర్ధిక స్థోమత లేదు కాబట్టి రాజ్యాంగం కల్పిస్తున్న ఎమ్మెల్సీ వంటి పదవులు కూడా ఇతరులకు కట్టబెడుతున్నప్పుడు తమ ఉద్యమపోరాటానికి గుర్తింపు ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సిద్దించిన మొదటి ఐదేండ్లు సీఎం చంద్రశేఖర్ రావు మాట ప్రకారం నడుచుకున్నామని, రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులకోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూడాల్సి వస్తోందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎంపికైన అభ్యర్ధులకు గతంలో అవకాశం ఇచ్చారని, మళ్లీ రెండోసారి కూడా ఎందుకు పదవులు కట్టబెడుతున్నారని ఆశావహులు సీరియస్ ప్రశ్నిస్తున్నారు.
జీవితకాలం వెయిటింగ్ లిస్టేనా..? కేసీఆర్ ను నిలదీస్తున్న మలిదశ ఉద్యమకారులు
కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డిలకు రెండోసారి అవకాశం కల్పించడం, పాడి కౌషిక్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, బండ ప్రకాష్ లకు అవకాశాలు కల్పించడం ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకూ టీఆర్ఎస్ పార్టీని, చంద్రశేఖర్ రావు ను దుమ్మెత్తి పోయడమే కాకుండా ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి అవకాశాలు కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 20ఏళ్లుగా తెలంగాణ కోసం కష్ట పడిన నిజమైన ఉద్యమ కారులు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నారు. చద్రశేఖర్ రావు మాటకు విలువిచ్చి ఇంతకాలం సహనంతో ఉన్నామని ఇప్పుడు మళ్లీ వేచి చూడాలంటే తమ వల్ల కాదని ఉద్యమకారులు స్పస్టం చేస్తున్నారు. ఏమైనా జరగొచ్చు, ఎప్పుడైనా ప్రగతిభవన్ ముందు నిరసన తెలపొచ్చు అనే సంకేతాలనిస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు.