రేవంత్ సవాల్: మేం సత్యసాయిలం కాదు.. అక్రమాలు నిజమేనన్న ఈటెల
హైదరాబాద్: పౌరసరఫరా శాఖలో అక్రమాలు నిజమేనని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం నాడు అన్నారు. ఈటెల ఈ రోజు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
పౌరసరఫరా శాఖలో అక్రమాలు నిజమేనని చెప్పారు. అయితే, 50 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలను ఒక్కటొక్కటిగా అరికడుతున్నామని చెప్పారు. రెండు రోజుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. పౌరసరఫరా శాఖలో తనిఖీలు కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సన్న బియ్యం పథకం తమ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమన్నారు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. అధికారుల ప్రమేయం లేకుండా అక్రమాలు జరగవని, పదేపదే అక్రమాలకు పాల్పడితే డీలర్ షిప్ తొలగిస్తామన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అక్రమాలు అరికట్టగలమని చెప్పారు. యాభై ఏళ్లలో సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా ఎవరూ చూడలేదన్నారు. అలాగే 57 ఏళ్లలో పాతుకుపోయిన చెడును ఏడాదిలో ఊడ్చేయలేమన్నారు. తామేం సత్యసాయి బాబాలం కాదన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో శిఖండి పాత్ర పోషించిన వారే నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వారి ఆలోచనలోనే కుట్ర దాగి ఉందని మండిపడ్డారు.
పౌరసరఫరా శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి.. సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి దొడ్డు బియ్యం ఇస్తున్నారని, వాటిని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు.