దొంగేమో అనుకుని.. కానిస్టేబులును కొట్టారు...
రోడ్డు పక్కన బైక్. అతడు చుట్టూ చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు. బైక్ కవరులోని డాక్యుమెంట్లు బయటకు తీసి చూస్తున్నాడు.
కొత్తగూడెం: రోడ్డు పక్కన బైక్. అతడు చుట్టూ చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు. బైక్ కవరులోని డాక్యుమెంట్లు బయటకు తీసి చూస్తున్నాడు. కొంచెం దూరంలోగల కారులో కూర్చుని మాట్లాడుకుంటున్న ఆ బైక్ యజమాని, అతడి స్నేహితుడు గమనించారు. 'ఎవడో దొంగ వచ్చాడు. బైక్ దొంగతనం చేస్తున్నాడు' అనుకుని, కోపంతో ఊగిపోయారు.
'దొరికాడ్రా.. దొంగ' అనుకుంటూ పరుగెత్తుకుంటూ బైక్ వద్దకు వెళ్లారు. డాక్యుమెంట్లను చూస్తున్న ఆ వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తిన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? సివిల్ డ్రెస్సులో ఉన్న హెడ్ కానిస్టేబుల్...
అసలేం జరిగిందంటే...
ఆదివారం ఉదయం పాల్వంచలో ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆదివారం ఉదయం పాల్వంచలోని బస్టాండ్ సెంటరుకు జీపులో వచ్చారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ అక్కులు ఉన్నారు. ఆ సెంటరులో నంబర్ లేని బైక్ పార్క్ చేసి ఉంది. ఆ బండి ఓనరును తీసుకురావాలని హెడ్ కానిస్టేబులును ఎస్సై పంపించారు. ఆ కానిస్టేబుల్ వెళ్లి చూశారు.
చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. బైకులోని డాక్యుమెంట్లను బయటకు తీసి పరిశీలిస్తున్నారు. ఆయన సివిల్ డ్రెస్సులో ఉన్నారు. కొంచెం దూరంలోగల కారులో ఆ బైక్ ఓనర్, అతడి స్నేహితుడు ముచ్చట్లాడుకుంటున్నారు. బైకులోని డాక్యమెంట్లను ఎవరో బయటకు తీసి చూస్తుండడాన్ని గమనించారు. బైక్ దొంగేమో అనుకున్నారు. కోపమొచ్చింది.
'దొరికాడ్రా.. దొంగ' అనుకుంటూ పరుగెత్తుకుంటూ బైక్ వద్దకు వెళ్లారు. డాక్యుమెంట్లను చూస్తున్న ఆ వ్యక్తిపై ఒక్కసారిగా మీద పడ్డారు. తీవ్రంగా కొట్టారు. బైక్ కాగితాలను బయటకు ఎందుకు తీశావని అడుగుతూ కొడుతూనే ఉన్నారు. తాను కానిస్టేబులునని అతడు చెబుతున్నప్పటికీ... ఆవేశంతో ఊగిపోతున్న ఆ ఇద్దరు వినిపించుకునే పరిస్థితిలో లేరు.
ఇంతలో ఎస్సై అక్కడకు వచ్చారు. విషయం చెప్పారు. దాడి చేసిన ఆ ఇద్దరు నాలుక కరుచుకున్నారు. సివిల్ డ్రెస్సులో ఉండడం, బైక్ డాక్యుమెంట్లు బయటకు తీయడంతో దొంగేమోనని అనుకున్నామని, పొరపాటు జరిగిందని, క్షమించాలని ఎస్సైని ఆ ఇద్దరు వేడుకున్నారు. వారిని ఆ ఎస్సై ఏమీ అనకుండా వదిలేశారు. అదీ సంగతి...