ప్లాస్టిక్ బ్యాగ్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తినష్టం
హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పేశాయి.
సీఐ పి భిక్షపతిరావు కథనం ప్రకారం.. బాలానగర్ ఎస్వీసీఐఈలోని కృష్ణ వొవెన్ సాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్లాస్టిక్ సిమెంట్ సంచులు తయారుచేస్తారు. కాగా, శనివారం ఉదయం 7గంటలకు కంపెనీలో 40మంది కార్మికులు పని చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రింటింగ్ మెషిన్ మోటార్ నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసి పెయింటింగ్కు అంటుకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు బయటకు పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
ట్యాంకర్లు సరిపోకపోవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్ జలమండలి ట్యాంకర్లలను రప్పించారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు 4గంటలకు పైగా సమయం పట్టింది.
విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో పరిశ్రమలోని సంచులు, మెటీరియల్, యంత్రాలు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. యజమాని ఐరెల్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.