తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరో షాక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో-39 తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపిటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో-39ను తీసుకొచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. జీవో 39తో రెవెన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.
వాదనలు విన్న హైకోర్టు.. రైతు సమితులకు విడుదల చేసిన రూ. 500కోట్లను ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ. 500కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ స్పష్టం చేసింది.