ఆసక్తికరం: 'దొరల పాలనొద్దు టిడిపిలోకి రండి', 'ఎన్టీఆర్ కూడ దొరే'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ల మధ్య మంగళవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మధ్య ఆసక్తిర చర్చ సాగింది. టీఆర్ఎస్లోకి రావాలంటూ సండ్ర వెంకటవీరయ్యను, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు ఆహ్వానించారు. ఇందుకు సండ్ర బదులిస్తూ.. " మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు" అని ఆయన అన్నారు. కెసిఆర్ దొర అయినా... బడుగుల కోసం పనిచేస్తున్నారని బాలరాజు చెప్పారు.

బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర చెప్పగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు చెప్పారు. ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవని బాలరాజుకు ధీటుగా సండ్ర సమాధానమిచ్చారు. బడుగుల గురించి ఎన్టీఆర్ కన్నా సీఎం కేసీఆర్ బాగా ఆలోచన చేస్తున్నారని సండ్రతో ఎమ్మెల్యే బాలరాజు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications