తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు: రోహిత్ కులంపై ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: రోహిత్ తన సూసైడ్ నోట్లో తల్లి, చెల్లి గురించి మాత్రమే ప్రస్తావించాడని సామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. సూసైడ్ నోట్లో రోహిత్ తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రోహిత్ ప్రస్తావించని తండ్రిని ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి సృష్టించాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
రోహిత్ దళితుడు అనడానికి అతని మాటలు, జీవనమే సాక్ష్యాలని కంచె ఐలయ్య అన్నారు. రోహిత్ దళితుడు కాదనడానికి తండ్రితోసహా మరేవి సాక్ష్యాలు కావని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోని దళిత సంఘాలు ఈ కుట్రల నుంచి దళిత తల్లిని కాపాడుకోవాలని ప్రోఫెసర్ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు.
రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో విసీ అప్పారావు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను సిపిఐ నేత నారాయణ తప్పు పట్టారు. రోహిత్ కుటుంబానికి పార్టీ తరఫున లక్ష రూపాయలు అందజేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
కాంగ్రెసు నేతలు కూడా హెచ్సియుకు వచ్చిన తమ సంఘీభావం తెలిపారు. ఎపిపిసిసి అధ్యక్షు రఘువీరా రెడ్డి తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టి నిరవధిక నిరాహార దీక్ష శనివారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.
దీక్ష చేస్తున్న విద్యార్తులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి బీపీ, షుగర్ లెవెల్స్ తగ్గినట్లు వారు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.