ఇది ఢిల్లీ డ్రామా.!కేసీఆర్,బీజేపి కలిసే నాటకాలు.!రైతులకు కాంగ్రెస్ అండ.!తెలంగాణ సమాజానికి రేవంత్ లేఖ.!
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ చదరంగంలో రైతును ఘోరంగా బలి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ఎప్పుడో యాసంగి పంటకు సంబంధించిన సమస్యను ఇప్పటి వానాకాలం పంటకు ముడి పెట్టి తడి గుడ్డతో రైతు గొంతు కోస్తున్నారని, కల్లంలో రైతు కన్నీరు తుడవాల్సిన ముఖ్యమంత్రి ఇందిరా పార్కు వద్ద ఏసీ టెంటు కింద రెండు గంటలు సేదతీరి పలాయనం చిత్తగించాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. వరి ధాన్యం కొనుగోలు, కేంద్రంతో సీఎం చంద్రశేఖర్ రావు జరుపుతున్న సంప్రదింపుల వెనక దాగున్న అంశాలపై రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సవివరణ లేఖ రాసారు.
కల్లాల్లో రైతు కన్నీరు.. ఢిల్లీలో కేసీఆర్ సేదతీరుతున్నాడన్న రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వంపై యుద్దం చేస్తానని ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడం వెనుక ఎలాంటి స్వప్రయోజనాలు దాగున్నాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొలకెత్తిన ధాన్యం కొనే విషయమై ముఖ్యమంత్రి ఇచ్చే హామీ ఏంటని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సేకరణ ఆలస్యమవ్వడం వల్లే ఆ పంట వర్షంలో తడిచి, మొలకెత్తింది. కాబట్టి, దాన్ని కొనే బాధ్యత కచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి, వరిదాన్యం గొనుకోలు అంశం, బీజేపి టీఆర్ఎస్ పార్టీల అవగాహనా రాజకీయాలు, తెలంగాణ రైతు దయనీయ పరిస్థితి అనే అంశాలపై తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి సుధీర్గ లేఖ రాసారు.
నీ ఉత్తరమే వరి రైతు పాలిట ఉరి కాదా.! కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన పీసిసి ఛీఫ్..
యాసంగి పంట కొనుగోలుపై ఒత్తిడి తేబోమని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుందో తెలియదు. ఎఫ్ సి ఐకి ఇచ్చిన ఆ లేఖే ఇప్పుడు వరి పండించే రైతాంగం పాలిట ఉరిగా మారింది. కేంద్రానికి అంగీకార పత్రం ఇచ్చారు కాబట్టే ఇకపై వరి వేస్తే ఉరే అన్న ప్రకటన చంద్రశేఖర్ రావు చేశారన్నారు రేవంత్ రెడ్డి. ఇలా వ్యవసాయ చట్టాలపై, పంటల విధానాలపై మోదీతో అడుగడుగునా అంటకాగిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు ప్రజల్లో వెల్లువెత్తున్న వ్యతిరేకత చూసి యూటర్న్ తీసుకున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఆర్ఎస్ ధర్నా కారణంగా నల్ల చట్టాలు రద్దైతే.. మరి ధాన్యం కొనుగోలుపై ఒత్తిడి తేలేరా..?
అంతే కాకుండా నల్ల చట్టాల రద్దు తమ నాయకుడు ఘనతే అని మంత్రులు కూడా సిగ్గుఎగ్గు లేకుండా ప్రకటనలు చేస్తున్నారని, చంద్రశేఖర్ రావు ఏసీ టెంటులో రెండు గంటల ధర్నాతోనే మోదీ దిగొచ్చి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ప్రచారం చేసుకోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది నిజంగా ఉద్యమం చేసిన రైతులను అవమానించడమే అవుతుందని, నల్ల చట్టాలను రద్దు చేయించే శక్తే చంద్రశేఖర్ రావు కు ఉంటే అదే శక్తిని ఉపయోగించి ధాన్యం కొనేలా మోదీని ఒప్పించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
టీఆర్ఎస్, బీజేపీల పై తెలంగాణ రైతాంగం విశ్వాసం కోల్పోయింది.. స్పష్టం చేసిన రేవంత్
తెలంగాణ రైతాంగం టీఆర్ఎస్,కేంద్ర బీజేపి ప్రభుత్వాలపై విశ్వాసాన్ని కోల్పోయిందని, క్షేత్ర స్థాయిలో రైతుల మనోభావాలకనుగునంగా ఈ ప్రభుత్వాలు పని చేయడం లేదని రేవంత్ స్పష్టం చేసారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల బాధలు నేరుగా తెలుసుకునేందుకు "కల్లాల్లోకి కాంగ్రెస్" పేరుతో కాంగ్రెస్ నాయకత్వం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిందని, అక్కడ రైతుల గోస ప్రత్యక్షంగా చూడడం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 -30 రోజులు గడుస్తున్నా కొనేనాథుడు లేడని బోరున విలిపిస్తున్నారు. కొందరు రైతుల పంట కొనుగోలు పూర్తైనా ఇంత వరకు వాళ్ల ఖాతాలకు డబ్బులు వేయలేదని వర్షంలో తడిసి, మొలకెత్తిన ధాన్యం చూపించి కన్నీరుమున్నీరవుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
కలిసే హక్కులు సాదించుకుందాం.. అన్నదాతలకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి..
నల్ల చట్టాల రద్దుతో సమస్య పరిష్కారం అయిపోలేదని, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం మరో రూపంలో బడా కార్పొరేట్లకు అనుకూలంగా, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడవచ్చని, తన వ్యక్తిగత అవసరాల కోసం చంద్రశేఖర్ రావు కూడా తెర వెనుక ఆ ప్రయత్నానికి మద్ధతు పలికే ప్రమాదం ఉందని, కాబట్టి రైతుజాతి అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.చీకటి ఒప్పందంలో భాగంగానే చంద్రశేఖర్ రావు బృందం తాజా ఢిల్లీ పర్యటన చేస్తోందని మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు బృందం తీర్థయాత్రల పర్యటనలతో ప్రయోజనం లేదని, అందుకే ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని, కలిసి ఉద్యమించి, హక్కులు సాధించుకుందామని రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు.