‘ఓటుకు నోటు’లో బాబు పాత్ర, ఏం చేద్దాం: గవర్నర్తో కెసిఆర్ 3గంటల చర్చ
హైదరాబాద్: 'ఓటుకు నోటు' కేసు పునర్విచారణకు ఏసిబి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం గవర్నర్తో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శాసనసభలో జిఎస్టీ బిల్లు ఆమోదం పొందగానే సీఎం నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు.
తర్వాత కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏసీబీ డిజి ఎకె ఖాన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పాటు కొనసాగిస్తూ కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందిన విషయాన్ని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాజీశ్ శర్మకు గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపాక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం సీఎం సమక్షంలో ఏసీబీ డిజి ఖాన్, ఎజి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసిబి కోర్టు 'ఓటుకు నోటు' కేసును దర్యాప్తు చేయాల్సిందిగ ఆదేశించిన నేపథ్యాన్ని గవర్నర్కు వివరించినట్టు తెలిసింది. కేసులో తదుపరి చర్యలపై గవర్నర్తో సీఎం చర్చించినట్టు తెలిసింది. ఎకె ఖాన్, రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా గవర్నర్తో సిఎం కెసిఆర్ దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించారు. గవర్నర్తో ఏకాంతంగా ముఖ్యమంత్రి ఏ విషయం చర్చించారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గవర్నర్కు కవిత ఆహ్వానం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను.. నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం రాజ్భవన్లో కలిశారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలపై సెప్టెంబరు 2న హైదరాబాద్ ఏవీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరు కావాలని ఆమె గవర్నర్ను కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారు.
గవర్నర్తో ఎంపీ కవిత
జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3,500 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా, ఇందులో 1,500 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. సెప్టెంబరు 2న కేంద్రమంత్రి రాజీవ్ప్రతాప్ రూడీ చేతుల మీదుగా హైదరాబాద్ అశోక్నగర్లో జాగృతి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత గవర్నర్కు వివరించారు.
గవర్నర్తో సీఎం కేసీఆర్
జీఎస్టీ బిల్లు ఆమోదంతో పాటు మూడు ఆర్డినెన్స్ల ఆమోదం తదితర అంశాల గురించి సీఎం గవర్నర్కు సీఎం నివేదించినట్లు తెలిసింది. జీఎస్టీకి అన్ని పక్షాల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించిందని వివరించారు. వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా సమావేశాలను వచ్చే నెల మూడో వారానికి వాయిదా వేశామని వివరించారు.
ఓటుకు నోటుపై చర్చ
కొత్త జిల్లాలపై కార్యాచరణ గురించి సీఎం గవర్నర్కు వివరించారు. దీనిపై నివేదికను ఆయనకు అందజేశారు. ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి సీఎం గవర్నర్కు వివరించినట్లు తెలిసింది. తాము చట్టప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొన్నట్లు సమాచారం.
ఓటుకు నోటుపై చర్చ
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రపై విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంతో తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్ మంగళవారం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్రావు కూడా అక్కడే ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెప్టెంబరు 29లోగా ఫిర్యాదులోని అంశాలపై విచారించి తమకు నివేదిక సమర్పించాలని కూడా న్యాయస్థానం ఏసీబీను ఆదేశించింది.
ఓటుకు నోటుపై చర్చ
ఈ నేపథ్యంలో ఎకె ఖాన్ గవర్నర్ నరసింహన్ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పురోగతి, న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు ఎలా ఉండబోతుందన్న వివరాలను ఆయన గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. విచారణ త్వరగా పూర్తిచేయాల్సి ఉన్నందున ఏసీబీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాలన్నీ గవర్నర్కు ఎకె ఖాన్ వివరించారు.