Mariyamma Lockup Death : తెలంగాణ సీఎస్,డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ(55) లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. దళిత,ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. మరియమ్మ చావుకు ఎస్సై మహేషే కారణమని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై స్పందించింది.ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏ చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ,డీజీపీలకు ఎస్సీ కమిషన్ నోటీసులు పంపించింది.
ఇదే కేసు విషయంలో హక్కుల కమిషన్ ఇదివరకే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్కు నోటీసులు జారీ చేసింది. జులై 23వ తేదీ లోపు దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.ఈ కేసులో రాచకొండ పోలీస్ కమిషనర్ ఎస్సై మహేష్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరియమ్మ లాకప్ డెత్ను నిరసిస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ గురువారం(జూన్ 24) హైదరాబాద్లోని లిబర్టీలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. మరియమ్మ కుటుంబానికి న్యాయం జరగాలని... ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది.
అసలేంటీ కేసు :
అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని ఓ చర్చి ఫాదర్ ఇంట్లో మరియమ్మ(40) వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ నెల 3న మరియమ్మను చూసేందుకు ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్,స్నేహితుడు శంకర్తో కలిసి ఆ ఇంటికి వెళ్లాడు. ఈ నెల 7న తన ఇంట్లో రూ.2లక్షలు చోరీ జరిగిందని... మరియమ్మ,ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్,అతని స్నేహితుడు శంకర్లే ఈ చోరీ చేశారని చర్చి ఫాదర్ వారిపై కేసు పెట్టాడు. దీంతో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మ,ఆమె కుమారుడితో పాటు శంకర్ను అదుపులోకి తీసుకున్నారు.
మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... కస్టడీలోకి తీసుకున్నాక పోలీసులు అతన్ని,అతని తల్లి మరియమ్మను,స్నేహితుడు శంకర్ను విచక్షణారహితంగా కొట్టారు. తాము దొంగతనం చేయలేదని ఎంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. చింతకాని,అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వారిని లాఠీలతో,బెల్టుతో విపరీతంగా కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేక మరియమ్మ పోలీస్ స్టేషన్లోనే మృతి చెందింది.
చింతకాని పోలీస్ స్టేషన్లో తన కళ్లముందే తన తల్లిని పోలీసులు కొట్టారని మరియమ్మ కుమార్తె స్వప్న వాపోయింది. పోలీసులు విపరీతంగా కొట్టడంతోనే తన తల్లి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. వారికి ఏ పాపం తెలియదని చెప్పినా కనకరించలేదని వాపోయింది. నిరుపేదలమైన తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కన్నీరుమున్నీరైంది. రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోన్న ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.