రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం: ప్రధాని మోడీ
రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశామని, తాజాగా దాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్ఎఫ్సీఎల్ సందర్శించారు. రూ.2,268 కోట్లతో మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులు, బోధన్-బాసర-భైంసా, సిరొంచా - మహాదేవ్పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకుఈ సందర్భంగా మోడీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని, కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. 8 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని, శంకుస్థాపనలకే తాము పరిమితం కాలేదని, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించామన్నారు. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, అయినప్పటికీ రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టినట్లు మోడీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశామని, భవిష్యత్లో భారత్ యూరియా పేరితో ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని వెల్లడించారు.

సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికుందన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని మోడీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్, బీజేపీకి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు












Click it and Unblock the Notifications