కెసిఆర్ వెంటే నడుస్తా: మాజీ డిప్యూటీ సిఎం రాజయ్య స్పష్టీకరణ
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతానని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వెంటే నడుస్తానని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
వరంగల్ పార్లమెంటుకు త్వరలో జరిగే ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని తాను ఖండిస్తున్నానన్నారు. టీఆర్ఎస్లోనే కొనసాగుతూ బంగారు తెలంగాణలో భాగస్వామినవుతానని చెప్పారు.
రాజయ్య తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని ఇటీవల ఊహాగానాలు చెలరేగాయి. వరంగల్ లోకసభ సీటుకు జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెసు తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరిగింది. తెలంగాణ డిప్యూటీ సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
తెలంగాణ డిప్యూటీ సిఎంగా చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి వరంగల్ లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. కెసిఆర్ తలుచుకుంటేనే పదవులు వస్తాయని ఇటీవల రాజయ్య అన్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన తిరిగి కాంగ్రెసులో చేరుతారంటూ ప్రచారం సాగింది.