కెసిఆర్ మైండ్ గేమ్.. ఎర్రబెల్లి లేఖపై రేవంత్ ఆగ్రహం: బాబుతో అత్యవసర భేటీ!
హైదరాబాద్: తమను అసలైన టిడిపి సభ్యులుగా గుర్తించాలంటూ సభాపతి మధుసూదనా చారికి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు రాసిన లేఖ పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. సభాపతికి ఎర్రబెల్లి లేఖ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించేందుకు తెలంగాణ టిడిపి సభ్యులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కానున్నారు.
ఎర్రబెల్లి ఏకపక్షంగా లేఖ రాశారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, మిగిలిన టిడిపి సభ్యులు శుక్రవారం నాడు సభాపతిని కలిసే అవకాశముందని తెలుస్తోంది. అంతకుముందే చంద్రబాబుతో భేటీ కానున్నారు.
కాగా, తమను అసలైన టిడిపిగా గుర్తించాలని ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ఎర్రబెల్లి సహా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కేపీ వివేకానంద, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డిలు సంతకం చేశారు.