కెసిఆర్పై ఒక్కటిగా: రేవంత్ రెడ్డి భుజం తట్టిన సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భుజాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇది ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సంఘటన శనివారం నాడు జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు, తమ ఉమ్మడి రాజకీయ శత్రువు టీఆర్ఎస్ పైన నిప్పులు చెరిగారు. టీడీపీ ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి రేవంత్ భుజం తట్టారు.
కేసీఆర్ సర్కారుపై కలిసి పోరు సాగిద్దామన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం చేవెళ్లలో జరిగింది.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభకు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి ప్రసాద్ కుమార్తో కలిసి అక్కడికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి నేరుగా వేదిక ఎక్కి రేవంత్ భుజం తట్టారు.
ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మార్చరాదని శంకరపల్లి నుంచి చేవెళ్ల వరకు టిడిపి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఈ సంఘటన జరిగింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిల మాట్లాడుతూ... ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చడం వెనుకకుట్ర ఉందని ఆరోపించారు. ప్రతి ఒక్కరిని మెప్పించి, ఒప్పించి రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.