ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు.. పెంపకంలో లోపమా ..? విద్యావ్యవస్థ శాపమా ..?
విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే పరీక్షలో ఉత్తమ మార్కులు రాకపోయినా.. లేదా పరీక్షలో తప్పిన ప్రాణాలు తీసుకునే స్థాయి వరకు వెళుతోంది. మంచి మార్కులు తీసుకుచ్చి స్టేట్ లెవెల్లో టాప్ టెన్లో నిలవాలని విద్యార్థులపై తల్లిదండ్రుల ఒత్తిడి ఓ వైపు... కాలేజీకి మంచి పేరు తీసుకుచ్చి మార్కెటింగ్ చేసుకోవాలన్న తపనతో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి మరోవైపు వెరసి విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదంగా మారుతున్నాయి. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలతో పాస్ కాని విద్యార్థులు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విద్యార్థులపై మానసిక ఒత్తిడి
చదువు అనేది ఒక వ్యక్తికి అవసరం. తన జీవితంలో చదువు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. చదువే జీవితం కాదు. కానీ నేటి పరిస్థితులు చూస్తే చదువు లేకుండా బయట ప్రపంచంలో బతకలేమో అన్నంతంగా సిచువేషన్ క్రియేట్ చేస్తున్నారు తల్లిదండ్రులు విద్యాసంస్థలు. విద్యార్థులపై పోటీ బూచీని చూపి వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీంతో పరీక్షలో ఫెయిలైతే అదేదో జీవితంలోనే ఫెయిల్ అయినట్లు భావించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు.
ఇంతకీ తప్పు ఎవరిది...?
గురువారం ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన కొద్ది గంట్లోనే రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ముగ్గురు శుక్రవారం సూసైడ్ చేసుకున్నారు. అయితే వీరి మరణాలకు ఎవరు కారణం... తమ పిల్లలపై మానసిక ఒత్తిడి తెచ్చిన తల్లిదండ్రులదా.. లేక కాలేజీ యాజమాన్యందా..? ఫెయిలయితే తమ తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు విద్యార్థులు ఫెయిలై ముఖం చూపించలేక అవమానంతో తనువు చాలిస్తున్నారు. ఎప్పుడూ పోటీతత్వం గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు తప్పితే.... వారిని మానసికంగా ప్రిపేర్ చేద్దామన్న సంగతి మరుస్తున్నారు. పరీక్షల్లో పాస్ అయినంత మాత్రానా జీవితాన్ని గెలిచినట్టు కాదు... ఫెయిల్ అయినంత మాత్రానా జీవితంలో ఓడినట్లు కాదు అని చెప్పలేక పోతున్నారు.
తల్లిదండ్రుల ఒత్తిడితోనే...
పదవ తరగతి పాస్ అవగానే విద్యార్థి ఇంటర్మీడియెట్కు వస్తాడు. ఇక అప్పటి నుంచే తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలపై పడుతుంది. మానసిక ఉల్లాసానికి దూరం అవుతారు. ఇంట్లో అందరూ ఏదైనా వేడుకకు వెళితే... ఇంటర్ చదివే విద్యార్థిని మాత్రం చదువుకో అని చెప్పి వారిని ఇంట్లో వదిలేసి వెళతారు. ఆ సమయంలో విద్యార్థి నిజంగా చదువుతాడా అంటే లేదు. తన మనస్సు మొత్తం ఆ వేడుకపైనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనిషి ఒక దగ్గర మనస్సు మరో దగ్గరన్న మాట.ఎంత సేపు విద్యార్థులపై చదువుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చే తల్లిదండ్రులు... మీకోసం ఇంత ఖర్చు చేశాం అంత ఖర్చు చేశాం మంచి మార్కులు తీసుకురాకుంటే ఎలా అని పదేపదే వారి మెదడులో నిక్షప్తం అయ్యేలా మాటలు మాట్లాడటంలాంటి విషయాలను పిల్లల వద్ద తీసుకురావద్దని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఈ మాటలను గుర్తు పెట్టుకుంటున్న విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయితే ముఖం చూపించుకోలేక, తల్లిదండ్రులు దండిస్తారేమో అని భయపడి మరణానికి దారులు వెతుక్కుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
మానసిక ధైర్యం చెప్పాలి
తల్లిదండ్రులు పిల్లలకు మానసిక ధైర్యం చెప్పకపోతే... భవిష్యత్తులో ఎదురైయ్యే మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కోలేరు అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో సామర్థ్యం ఉంటుంది. అంతకుమించి వారి నుంచి ఆశిస్తే ఒత్తిడికి గురవుతారు. అలాంటి వారిని ప్రోత్సహించే విధానాలు తెలుసుకొని వారిని మానసికంగా బలవంతుల్ని చేయాలి. లేకుంటే ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోలేరు. అందుకే సమస్యల్ని తట్టుకునేలా విద్య ఉండాలని నిపుణులు చెబుతున్నారు.