డిసెంబర్9 ప్రకటన అన్నారు తప్పితే.!సోనియా గాంధీ పేరెత్తని టీఆర్ఎస్ నేతలు.!అవసరం తీరిందనా.?ఆత్మరక్షణా.?
హైదరాబాద్ : రాజుకున్న అగ్గి.. హోరెత్తుతున్న నినాదాలు.. ఒక్కటవుతున్న కోట్ల గొంతుకలు.. వెల్లువెత్తుతున్న తీవ్రనిరసనలు.. ఎక్కడికక్కడ జాయింట్ ఆక్షన్ కమిటీలు..వెరసి తెలంగాణ మలిదశ ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణం. రాస్తారోకోలు, నిరసనలు దీక్షలు, సహాయ నిరాకరణలు, విద్యాస్థల బంద్.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారధ్యంలో దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ నినాదాలు, ముట్టడి కార్యక్రమాలు.. రాజకీయ నాయకుల మాటల తూటాలు.. అక్కడక్కడ ఆంధ్ర ప్రాంత బస్సుల దహనాలు, రాళ్లురువ్వడం వంటి హింసాత్మక ఘటనలు అప్పుడప్పుడే ఆజ్యంపోసుకుంటున్న సమయం.. సరిగ్గా ఇదే సమయంలో ఏఐసీసీ అధినేత్ర శ్రీమతి సోనియా గాంధీ అనూహ్య ప్రకటన ఎగిసి పడుతున్న ఆగ్రహజ్వాలలను ఒక్కసారిగా చల్లార్చగలిగింది.
శ్రీమతి సోనియా గాంధీ తెగింపు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గు
పరిస్దితులు ఎలా పరిణమించినప్పటికి డిసెంబర్ 9న శ్రీమతి సోనియా గాంధీ ప్రకటనతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తధ్యం అనే అంశం తేలిపోయింది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్లీ వెనక్కి తగ్గడం, కమిటీలు వేయడం, కాల యాపన చేయడం వంటి కార్యక్రమాలు చోటు చేసుకున్నప్పటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రకటించని తప్పని పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల లోతుగా అధ్యయనం చేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీని నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఏ కమిటీలు వేసినా తెలంగాణ ఏర్పాటు పట్ల ఎంత కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ ఉందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్ధం ఐపోయింది.
సోనియా పరాక్రమ నిర్ణయాన్ని పక్కన పెట్టిన టీఆర్ఎస్.. గుర్తుచేసుకోని నేతలు
తెలంగాణకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని ప్రజలు ఎప్పుడైతే గ్రహించారో తెలంగాణలో వాతావరణం శాంతించింది కానీ ఆంధ్రాలో మాత్రం భగ్గుమంది. ఊరూ వాడా సమైఖ్యాంధ్ర నినాదాలు, ఉద్యమాలు.. రాస్తారోకోలు, విద్యాసంస్థల బందులు అన్నీ తారా స్థాయిలో జరిగిపోయాయి. ఐనప్పటికి కాంగ్రెస్ పార్టీ తగ్గేది లే అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. ఆ తర్వాత అందుకు తగ్గ రాజ్యంగ బద్దమైన మార్పులు, చేర్పులు కూడా చకచకా జరిగిపోయాయి. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుపుకోవచ్చని రాష్ట్రపతి కార్యాలయం నుంచి గెజిట్ విడుదలైంది.
సోనీయా గాంధీ చొరవతోనే తెలంగాణ సాద్యం.. శాసనసభలో కేసీఆర్ ప్రకటన
అప్పుడు ఢిల్లీలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. గ్రూప్ ఫోటో కూడా తీయించుకున్నారు. తర్వాత జరిగిన తెలంగాణ తొలి శాసన సభ సమావేశాల్లో ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలో సోనియా గాంధీ దేవత, తెలంగాణ తల్లిగా చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. శ్రీమతి సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యిందని నిండు శాసనసభలో చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారు. ఆ తర్వాత రాజకియ పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తూ వచ్చారు చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో దూషించారు చంద్రశేఖర్ రావు.
ధైర్యం కోల్పోయిన నాయకత్వం.. ఆత్మరక్షణలో నాయకులు
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షలో భాగంగా చెలరేగిన ఆగ్రహ జ్వాలలను డిసెంబర్ 9న తన ప్రకటనతో చల్లార్చిన శ్రీమతి సోనియా గాంధీ వీర పరాక్రమ నిర్ణయాన్ని గానీ, సాహసోపేత ప్రకటన పట్ల గానీ తెలంగాణ నాయకులు ఎక్కడా ప్రస్తావించకపోడం విస్మయానికి గురిచేస్తున్న అంశం. 2009 డిసెంబర్ 9న శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేసి ఉండి ఉండకపోతే నేడు అహింసతో కూడుకున్న తెలంగాణ సాద్యమయ్యేదా.? నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి సోనియా గాంధీకి తెలంగాణ నాయకులు చూపించే కృతజ్ఞత ఇదేనా.?ఎందుకు డిసెంబర్ 9 ప్రకటన, చంద్రశేఖర్ రావు దీక్ష దివస్ అన్నారు తప్ప శ్రీమతి సోనియా గాంధీ ప్రకటన అని ఎందుకు అనలేకపోయారు. అవసరం తీరిపోయింది ఇంకెందుకులే అనే నిర్లక్ష్యమా, లేక అధికార పార్టీ నాయకులు అభద్రతా భావంలో, ఆత్మరక్షణలో ఉన్నారనే కారణమా.?తెలంగాణ సమాజమే తేల్చాలి.