రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.. కేసీఆర్ సర్కార్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, రైతులను మోసం చేస్తున్నారంటూ కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్ పంట కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి టార్గెట్ గా కోమటిరెడ్డి రచ్చ: ఉద్యమం మొదలు పెడతా; తడాఖా చూపిస్తానంటూ షాకింగ్ వ్యాఖ్యలు
రైతులకు న్యాయం జరగకుంటే ఆమరణ నిరాహార దీక్ష
ప్రభుత్వ తీరు మారకుంటే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని తెలంగాణ సర్కారు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రభుత్వం, రైతులకు మద్దతు ధర ఇవ్వటంలో విఫలమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి దయనీయం
అసలు ఖరీఫ్ పంట కొనుగోలు పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని మండిపడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలను ఎందుకు తెరవ లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పంట కొనుగోలుపై అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.
వరి సాగు చెయ్యొద్దు అని చెప్పటానికి మీరెవరు ?
రబీ పంట సాగులో రైతులపై ఆంక్షలు పెట్టొద్దని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్బంధ వ్యవసాయం చేయిస్తాం అంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వరి పంట సాగు చేయొద్దని కెసిఆర్ సర్కార్ చెబుతోందని, వరి సాగు చెయ్యొద్దని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ప్రతి గింజ కొంటామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు ఆంక్షలు పెడుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు చెయ్యకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
ప్రతి గ్రామంలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టోకెన్ల పంపిణీలో రాజకీయ జోక్యం ఎక్కువ అవుతోందని ఆరోపించారు. తక్షణం రైతుల సమస్యలు పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ పోడు భూముల విషయంలో అమాయక గిరిజనులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పోడు భూముల విషయంలోనూ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.