తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకొస్తా.!30లక్షల మెంబర్ షిప్ లక్ష్యమన్న రేవంత్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం, ఆకాంక్షలు గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కృషి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేసారు. ఏ లక్ష్యాలు, ఆశయాల కోసం ప్రజలు ఉద్యమించారో, ఆ ఆశయాల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరముందని రేవంత్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సమాజంలోని అందరి సంక్షేమం వర్ధిల్లిన తరహానే, సోనియమ్మ రాజ్యం స్థాపిస్తామని చెప్పారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా కాంగ్రెస్ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదును, తెలంగాణ నుంచి ప్రారంభించడం ఛాలెంజ్ గా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తాం.. సోనియమ్మ రాజ్యం తెస్తానన్న రేవంత్
గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ లోని దళిత వాడలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఆశయాలు సాధిస్తామని అన్నారు. ఏడేళ్లుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కాకుండా, సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబం, ఆత్మీయుల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామని రేవంత్ వివరించారు.
తెలంగాణకు డిసెంబర్ 9 ప్రత్యేక దినం. కేసీఆర్ పాలన వల్ల దయనీయ పరిస్థితులన్న రేవంత్
తెలంగాణకు డిసెంబర్ 9 అత్యంత కీలకమైన రోజు అని రేవంత్ రెడ్డి అన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని, ఆకాంక్షను గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం కూడా తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన రోజు అని తెలిపారు. తెలంగాణ మొత్తం సంతోషంతో సంబరాలు జరుపుకోవాల్సిన రోజు అని చెప్పారు. కానీ తెలంగాణలో సంబరాలు జరుపుకునే పరిస్థితులు లేవని అన్నారు. ఏ ఉద్దేశాలతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో, ఆ ఉద్దేశాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు సాధించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని అన్నారు. ఆ బాధ్యతలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టిందని వివరించారు.
ఢిల్లీ నుంచి సోనియా సందేశం.. సోనియాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్న రేవంత్
దిల్లీ నుంచి సోనియా గాంధీ సందేశం డిజిటల్ రూపంలో మారుమూల ప్రాంతంలోని ప్రతీ కార్యకర్తకు చేరేందుకు కాంగ్రెస్ సభ్యత్వం దోహద పడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కంప్యూటర్ నిపుణుల్ని అందించిన ఘనత, భారత్ లో కంప్యూటర్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి దక్కుతుందని చెప్పారు. ప్రతీ పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ ఎన్ రోలర్ ద్వారా సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో 30లక్షల డిజిటల్ సభ్యత్వాల నమోదు చేయిస్తానని సోనియా గాంధీకి మాట ఇచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 34,765 పోలింగ్ బూత్ లలోని కాంగ్రెస్ ఎన్ రోలర్లపై నమ్మకంతోనే ఈ మాట ఇచ్చానని రేవంత్ తెలిపారు.
Recommended Video
కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు.. కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న రేవంత్ రెడ్డి
సభ్యత్వం తీసుకునే వారంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే అని, అందరి యోగక్షేమాలు చూసుకునే బాధ్యత పార్టీపై ఉంటుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి 2లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం, జీవితాలకు భద్రత కల్పించడంపై ఆలోచన తీసుకున్నారని తెలిపారు. 2018లో సీఎం చంద్రశేఖర్ రావు ,అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడటంతో ఓటమి పాలయినా, ఓట్ల సంఖ్య పెరిగిందని రేవంత్ గుర్తు చేసారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్దదైన, 33లక్షల ఓటర్లు కలిగిన మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెల్చినట్టు తెలిపారు. మోదీ, అమిత్ షా ఇద్దరి లోక్ సభ నియోజకవర్గాలు కలిపినా ఇన్ని ఓట్లు లేవని అన్నారు.